పుట్టింటికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
● అక్కాతమ్ముళ్లు దుర్మరణం
● భర్తకు తీవ్ర గాయాలు
● సత్తుపల్లి శివారులో ఘటన
చింతలపూడి: పెళ్లయి ఐదు నెలలే అయ్యింది.. పుట్టింటిపై మమకారంతో భర్తతో కలిసి వెళ్లి తిరిగి మెట్టింటికి తోడబుట్టిన తమ్ముడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఆదివారం తెలంగాణలోని సత్తుపల్లి శివారులోని తమ్మిలేరు బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో అక్కాతమ్ముడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. పెనుబల్లి మండలం సూరయ్య బంజరు గ్రామానికి చెందిన పుచ్చ కృష్ణయ్య, రమాదేవి దంపతుల కుమార్తె తేజస్విని (18)కి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన తోట మధుతో ఐదు నెలల క్రితం వివాహమైంది. పుట్టింటికి వచ్చిన కొత్త దంపతులు తిరిగి కండ్రికగూడెం బయలుదేరారు. దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తేజస్విని తమ్ముడు పుచ్చా దేవేందర్ (13)ను కూడా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పయనమయ్యారు. మార్గమధ్యంలో సత్తుపల్లి శివారు తమ్మిలేరు బ్రిడ్జిపై వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ వీరిని కొట్టింది. దీంతో అక్కాతమ్ముడు తేజస్విని, దేవేందర్ అక్కడికక్కడే మృతిచెందారు. భర్త తోట మధు తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అందించి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తె, కుమారుడు ఒకేసారి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తేజస్విని, దేవేందర్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మృతులు తేజస్విని, దేవేందర్ (ఫైల్)
పుట్టింటికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
పుట్టింటికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
పుట్టింటికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..


