ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకన విధుల నుంచి వివిధ వర్గాల ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జాక్టో నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు ఎస్ఎస్సీ మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాల వయసు దాటిన ఉపాధ్యాయులకు సైతం మినహాయింపు ఇవ్వాలని కోరారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు చెల్లించే రెమ్యూనరేషన్ను పెంచాలని, మంచినీరు, వెంటిలేషన్ తదితర సౌకర్యాలు కల్పించాలని, పాఠశాల యూనిట్గా 50 శాతం మించకుండా ఏఈ, స్పెషల్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు, బీ రాము, కే వెంకట రమణ, బీ విద్యా సాగర్, పీ సురేష్, టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్, ఎన్.ప్రవీణ్ కుమార్, ఎం.రాంబాబు, తోట ప్రసాద్ తదితరులున్నారు.


