ఏలూరు(ఆర్ఆర్పేట): ఆకివీడు పెద్దపేటలో మతసామరస్యత వాతావరణానికి విఘాతం కలగడానికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైఖరే కారణమని సీపీఎం ఏలూరు నగర కమిటీ నిర్వహించిన సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆకివీడు పెద్దపేట వివాదం ముదురుతుంటుంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఎలా వ్యవహరించినా సహకరించడం సరికాదన్నారు. పేటలో ఉన్న గుడిని ఏ విధంగా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇరువర్గాలను ఐక్యం చేస్తూ సమస్యను పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ జిల్లా ప్రశాంతతకు మారుపేరని, చిన్న చిన్న ఘర్షణలు జరిగినా వెంటనే సద్దుమణిగేవన్నారు. ఆకివీడులో జరుగుతున్న వివాదం కేవలం డిప్యూటీ స్పీకర్ రాజేస్తున్న వివాదం మాత్రమే తప్ప ప్రజల మధ్య వివాదం కాదన్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన 57 మంది దళిత యువకులను వెంటనే విడుదల చేయాలన్నారు.
దళిత క్రిస్టియన్ రైట్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పెరికే వరప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి ఒక కులానికో, మతానికో ఏకపక్షంగా వ్యవహరించడం తగన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం వలనే ఈ వివాదం ముదిరిందన్నారు. టీడీపీ, జనసేన కేడర్ కూడా ఆలోచించాలని, రఘురామకృష్ణరాజు కుట్రలో బలికావద్దన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ పూలె ఉద్యమ నేతలు డాక్టర్ పెరియార్ దాసరి జీవన్ శ్యాం, కెవీపియస్ జిల్లా కార్యదర్శి అండుగుల ఫ్రాన్సిస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సామజిక ఉద్యమ నేతలు మాంచెల్ల ఇస్సాక్, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, పీ.వెంకటేశ్వర్లు, పళ్లెం ప్రసాద్, వైఎస్ కనకారావు, జీ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్


