కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామస్తులు వేసవి నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం కాపాడుకునే దిశగా తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఐస్క్రీమ్లు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, దీంతో తమ గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లు రాకూడదంటూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిబంధనను మీరి ఎవరైనా ఐస్క్రీమ్ అమ్మితే రూ.3 వేలు, ఐస్క్రీమ్ కొన్న వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

డోలీ మోత.. గర్భిణుల వ్యథ!
గర్భిణులకు డోలీ కష్టాలు తప్పట్లేదు. అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని డొకిరిపాడుకి చెందిన పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గత్యంతరం లేక 3 కి.మీ. డోలీలోనే మోసుకెళ్లారు. బూసిపుట్టుకు చేరుకున్న అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేసినా రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో అరకులోయ ప్రాంతీయాస్పత్రికి తరలించారు. కాగా, డొకిరిపాడు రహదారి నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.5 కోట్లు నిధులు మంజురయ్యాయి. నిలిచిపోయిన పనులు కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేక పోతోందంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – డుంబ్రిగుడ


