నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం
● ఇప్పటికే ట్రాఫిక్తో సతమతం
● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ప్రజలు మండిపాటు
నూజివీడు: హైమాస్ట్ వీధి లైట్ల ఏర్పాటు పేరుతో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు పట్టణ ప్రజలు సైతం మండిపడుతున్నారు. పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్ జంక్షన్లో వీధిలైట్ల ఏర్పాటు కోసం తారురోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు గుంతను తవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలే ఇరుకు రోడ్లతో ఎదురెదురుగా వాహనాలు వస్తేనే తప్పుకోవడానికి వీలేలేని పరిస్థితిలో వి ద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తే జంక్షన్ రోడ్డు నుంచి బస్టాండు రోడ్డుకు బస్సులు, లారీలు ఏవీ కూడా మలుపు తిరగడానికి వీలుండదని అంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తే గంటలు తరబడి వాహనాలు నిలిచిపో తాయని చెబుతున్నారు.
రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభమా?
చిన్నగాంఽధీ బొమ్మ సెంటర్లో సర్కిల్ లేకుండా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పాలుచేయడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంతగా లైట్లు పెట్టాలనుకుంటే ఉన్న విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అయిన శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు ఆదివారం మాట్లాడుతూ రోడ్డు 30 అడుగుల వెడల్పు కూడా లేని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని ఏలా ఏర్పాటు చేస్తారని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.


