అన్నదాత దుఃఖీభవ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత దుఃఖీభవ

Aug 2 2025 7:06 AM | Updated on Aug 2 2025 7:06 AM

అన్నదాత దుఃఖీభవ

అన్నదాత దుఃఖీభవ

ఏలూరు(మెట్రో): అన్నదాత సుఖీభవ సాయం కోసం రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా సాయానికి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత రైతులను నిలువునా మోసం చేశారు. ఏడాదిపాటు సార్వా, దాళ్వా సీజన్లలో రైతులకు ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టారు. తీరా ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం జిల్లాలో సుమారు 40 వేల మంది రైతులకు కోత పెట్టనుంది.

గత ప్రభుత్వంలో పక్కాగా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో సుమా రు 2 లక్షల మంది రైతులకు సాయం అందగా.. తాజా గా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమారు 1,60,968 మంది అర్హులుగా కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 40 వేల మందికి సాయం అందకుండా పోనుంది.

సాయంలో మెలిక

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల అప్పులబాట

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించకపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారు లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నా రు. దీనికి తోడు దాళ్వా సీజన్‌లో రైతుల నుంచి ప్ర భుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు.

సార్వా నాట్ల ముగింపు దశలో..

జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీజన్‌లో వరి నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభు త్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవసరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అర్హుల జాబితా నుంచి సుమారు 40 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కౌలు రైతులకు ఎగనామం

కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధు లను అందిస్తామంటూ కూటమి సర్కారు మభ్యపెడుతోంది. అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణమని, కూటమి ప్రభు త్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే అని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులకు వెన్నుపోటు

అన్నదాత సుఖీభవ పథకంలో 40 వేల మంది రైతులకు కోత

గతేడాది లబ్ధికి ఎగనామం

రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ

ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక

కౌలు రైతులకు రిక్తహస్తం

మూడు విడతల్లో పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్‌

అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లావ్యాప్తంగా శనివారం 1,60,968 మంది రైతులకు రూ.107.08 కోట్ల లబ్ధి అందించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకం కింద రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14 వేలు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. సాయాన్ని మూడు విడతల్లో అందిస్తారని, మొదటి విడతగా రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement