ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. దేవస్థానం సిబ్బంది భక్తులకు క్యూ కాంప్లెక్స్లో నిరంతరాయంగా మజ్జిగ, మంచి నీటిని అందించారు. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం