నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
బుట్టాయగూడెం: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ ని యామక చట్టం చేయాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. శుక్రవారం దీక్షా శిబిరాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జి.గోపిమూర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే దీక్షా శిబిరాన్ని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉండాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 4297 మంది విద్యార్థులకు 3,026 మంది హాజరయ్యారు. 22 కేంద్రాల్లో తనిఖీలు చేయగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఓపెన్ పరీక్షలకు..
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు 302 మందికి 259 మంది హాజరయ్యారు. ఇంటర్ గణితం పరీక్షకు 75 మందికి 62 మంది, చరిత్ర పరీక్షకు 62 మందికి 47 మంది హాజరయ్యారని డీఈఓ చెప్పారు.
ఈఏపీసెట్కు 949 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో శుక్రవారం జరిగిన ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 977 మంది విద్యార్థులకు గాను 949 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 161 మందికి 161 మంది, మధ్యాహ్నం 161 మందికి గాను 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 148 మంది, మధ్యాహ్నం 150 మందికి గాను 143 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది, మధ్యాహ్నం 178 మందికి 174 మంది హాజరయ్యారు.
కోవిడ్పై అప్రమత్తం
దెందులూరు: కోవిడ్ బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్కుమార్ అ న్నారు. శుక్రవారం దెందులూరులో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ప్రార్థనా, సామాజిక సమావేశాలు, పార్టీలు వంటివి వాయిదా వేసుకోవాలని, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, చలి జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు, శరీర నొప్పులు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం వేకువ జామున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు మూడు దుక్కుల వర్షం కురిసిందని, ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం కురియలేదని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 19.8 మి.మీ, పెంటపాడులో 28.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి
పాలకొల్లు సెంట్రల్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నారని, జీతాలు పెంచాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు మున్సిపల్ వాటర్ సప్లయ్ వర్కర్స్ వినతిపత్రం అందజేశారు. ఔట్ సోర్సింగ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలన్నా రు. నాన్ పీహెచ్ (వాటర్ సప్లయ్ వర్కర్స్)కు వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని కోరారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి


