అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని విస్తరించేందుకు రూ.95 లక్షలతో పలు నిర్మాణాలు చేపట్టాలని అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు తీర్మానించింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ట్రస్ట్బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈఓ వీ త్రినాథరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వనదుర్గ ఆలయ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అమ్మవారి ఆలయంలో దిగువన ప్రతీ శుక్రవారం చండీహోమం, పౌర్ణమి, అమావాస్య తిధులలో ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ హోమాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గత నెల 20వ తేదీ నుంచి ప్రతీ శుక్రవారం ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఖడ్గమాల పూజ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మండపం విశాలంగా లేకపోవడంతో ఈ పూజలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం లేదు. దిగువన హోమ మండపంలో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు.
● దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు గత నెలలో దేవదాయశాఖ డిఫ్యూటీ స్థపతి శ్రీనివాస ఆచారి వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ మండపాన్ని తూర్పు వైపు 30 అడుగుల ముందుకు పెంచుకోవచ్చునని సూచించారు. ఆ నిర్మాణంతో బాటు ఇతర నిర్మాణ పనులు చేపట్టడానికి ట్రస్ట్బోర్డులో తీర్మానించారు.
● వచ్చే నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణకు, ఇతర పనులకు రూ.30.55 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించారు.
● కల్యాణ మహోత్సవాలలో కల్యాణ వేదిక ముందు ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు రూ.రెండు లక్షలు వ్యయం ఖర్చయ్యే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు.
● దేవస్థానం కేశఖండనశాలలోని భక్తుల టాయిలెట్స్, స్నానపు గదులలో రూ.40 లక్షల వ్యయంతో అధునాతన శానిటరీ వస్తువులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో
రూ.30.55 లక్షలతో విద్యుత్ అలంకరణ
కేశఖండన శాలలో రూ.40 లక్షలతో
అధునాతన శానిటరీ ఫిట్టింగ్స్
అన్నవరం దేవస్థానం
ట్రస్ట్బోర్డు సమావేశ నిర్ణయాలు


