రాజవొమ్మంగి: స్థానిక ఎస్సై టి.శివకుమార్ మంగళవారం ఏసీబీ ఉచ్చులో చిక్కారు. ఆయన రాజమహేంద్రవరానికి చెందిన అంబటి అఖిల్బాబు అనే వ్యక్తి దగ్గర రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ తెలిపారు. ఎస్సైను అదుపులోకి తీసుకొన్నామని వెల్లడించారు. ఇటీవల రాజవొమ్మంగి శివారు కిండ్ర జంక్షన్ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు వ్యక్తులు రాజవొమ్మంగికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దాట్ల వెంకటేష్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా ఒకరు పరారీలో వున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా రిమాండ్ అనంతరం ముగ్గురు నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో ఏ–1 ముద్దాయి అయిన అఖిల్బాబు తనపై రౌడీషీట్ ఓపెన్ చేయవద్దంటూ ఎస్సై శివకుమార్తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అలాగే పరారీలో వున్న ఏ–4 ముద్దాయి ఎ.ప్రసాద్ అనే వ్యక్తి తనపై కేసు లేకుండా చూడాలని కూడా ఒప్పందం జరిగిందని డీఎస్పీ కిశోర్కుమార్ విలేకరులతో అన్నారు. ఈ ఒప్పందం మేరకు నలుగురు నిందితులు కలసి ఇప్పటికే ఎస్సైకు రూ.25 వేల నగదు ఇవ్వగా, మరో 15 వేలు ఇస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో దాదాపు పది గంటల పాటు కాపు కాసిన ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ, సతీష్, భాస్కర్, సిబ్బంది రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ నగదు తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు.


