ధవళేశ్వరం: స్థానిక ప్రధాన రహదారి శాంతారామ్ హాస్పిటల్ సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరు మండలానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బేబీ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకకు చెందిన భార్యాభర్తలు యర్రంశెట్టి శ్రీనివాస్, బేబి గ్రామంలో త్వరలో జరగనున్న ఉత్సవాలకు కొత్తబట్టలు కొనుక్కునేందుకు సోమవారం షాపింగ్కు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ధవళేశ్వరం శాంతారామ్ హాస్పిటల్ సమీపానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మృతుని భార్య బేబిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బేబి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఆటోపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


