తాళ్లరేవు: నీటి అవసరాలు పెరిగిపోవడంతో అక్రమార్కులు భూగర్భ జలాలను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో నీటిని నిత్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థల అవసరాల కోసం భూగర్భ జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహదారుల చెంతన బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పలుచోట్ల అనధికారికంగా బోర్లను వేసి నీటిని యథేచ్ఛగా తోడుతున్నారు. నిత్యం లక్షలాది లీటర్ల నీటిని తోడి తరలిస్తుండడంతో భూగర్భజలాల స్థాయి పడిపోతుందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, పోలేకుర్రు తదితర పంచాయతీల్లో రహదారుల చెంతన బోర్లను వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో పట్టి కంపెనీలకు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా మండల అధికారులుగాని, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతుల్లేకుండా ట్రాక్టర్లు,
లారీ ట్యాంకర్లలో తరలింపు
పట్టించుకోని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు
పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న
మంచినీటి బోర్లు
అడుగంటుతున్న భూగర్భజలాలు


