● ప్రశాంతంగా
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
● 24,166 మంది విద్యార్థుల హాజరు
● 258 మంది గైర్హాజరు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే సందడి వాతావారణం, విద్యార్థులు, వారిని తీసుకువచ్చిన తల్లిదండ్రుల హడావుడి కనిపించింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టిక్కెట్ల నంబర్ ఆధారంగా బోర్డుపై రూమ్ నంబర్లు వెతుక్కోవడం, పరుగు పరుగున కేంద్రాల వద్దకు రావడం వంటి దృశ్యాలు కనిపించాయి. తొలి రోజు తెలుగు పరీక్షను 24,424 మంది రాయాల్సి ఉండగా 24,166 మందే హాజరయ్యారు. 258 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 138 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. కలెక్టర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా స్థాయి పరిశీలనాధికారులు 7 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి 4 కేంద్రాలు, పరీక్షల విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, మంగళగిరి ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంయుక్తంగా జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. మొత్తం 88 పాఠశాలలను అధికారులు తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరిసరప్రాంతాల్లో జిరాక్స్ దుకాణాలను మూయించివేశారు.
26 పరీక్షా కేంద్రాల్లో ఏపీఓఎస్ఎస్
ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 2,392 మంది విద్యార్థులు హాజరుకావాల్సివుండగా 1,833 మంది రాశారు. 559 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉర్దూ పరీక్ష ఇద్దరు విద్యార్థులు రాయాల్సివుండగా ఇద్దరూ హాజరయ్యారు. ఒరియా పరీక్ష ఒకరు రాయాల్సి వుండగా ఆ విద్యార్థి రాలేదు.


