కాకినాడ క్రైం: ఐక్యత చాటేందుకు క్రీడలు దోహదపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విశ్రాంత వీసీ, రాష్ట్ర విశ్రాంత డీఎంఈ డాక్టర్ కోరుకొండ బాబ్జీ అన్నారు. ఆదివారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ క్రికెట్ మెన్స్ పీజీల టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకకు డాక్టర్ బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోరాహోరీగా తలపడిన తుది పోరులో తిరుపతికి చెందిన శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ బృందం విజేతగా నిలువగా, కాకినాడ రంగరాయ టీమ్ రన్నర్ స్థానం దక్కించుకుంది. కర్నూలు వైద్య కళాశాల, అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలు మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం ముగింపు వేడుకల్లో డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య దూరాల్ని చెరపి, ఐక్యత పెంచేందుకే యూనివర్సిటీ క్రీడలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 20కి పైగా కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు రంగరాయ ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన టోర్నమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎంసీ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు సహా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్ఎంసీ మెడికో వలంటీర్లు ఎం.మోహన్ అప్పారావు, ఎస్కే మౌలాలి, యశ్వంత్, వినయ్, వసుధ, సాయి శ్వేత, శ్వేత, హర్షిణి తదితరులను డాక్టర్ విష్ణువర్థన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీఎస్ ముఖర్జీ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశి తదితరులు పాల్గొన్నారు.


