కొత్తపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం (బొమ్మూరు) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం నెలకొల్పేందుకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఆధ్వర్యంలో నిర్ణయించారు. 8 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేయాలని కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ను కోరారు. ఆ మేరకు ఆయన తన శిల్పశాలలో విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటికే విగ్రహాన్ని బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తరలించి, ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై నెలకొల్పి ఆవిష్కరణకు సిద్ధం చేసినట్టు శిల్పి రాజ్కుమార్ ఆదివారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరుతో పాటు ఒంగోలు తదితర జిల్లాల్లో నెలకొల్పిన సుమారు 25 పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాలను తాను రూపొందించానని తెలిపారు. తాజాగా ఈ కాంస్య విగ్రహం తయారు చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని వుడయార్ చెప్పారు.


