కళాపోషణ లేక.. | - | Sakshi
Sakshi News home page

కళాపోషణ లేక..

Oct 6 2025 2:18 AM | Updated on Oct 6 2025 2:18 AM

కళాపో

కళాపోషణ లేక..

ఉపాధి దూరమైంది

నేను డ్రామాలకు హార్మోనియం ఆర్టిస్టుగా జీవనం సాగిస్తున్నాను. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. నవరాత్రుల్లో ఖాళీ లేకుండా ప్రదర్శనలు ఉండేవి. కాలక్రమేణా ప్రేక్షకాదరణ తగ్గటంతో పాటు నాటకాల వ్యయం పెరిగిపోవడంతో అనేక ఉత్సవ కమిటీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దానితో ఎందరో కళాకారులకు ఉపాధి కరువైంది.

– కలిగట్ల వెంకటరమణ, హార్మోనియం కళాకారుడు, రాజమహేంద్రవరం

వైభవం కోల్పోతున్న రంగస్థలం

ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్లే ప్రదర్శనలు

చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఆదరణ కరవు

కొత్తపేట: కళా‘పోషణ’ కనుమరుగవుతోంది.. నాటక రంగం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది.. కళాకారులకు పూట గడవడమే కష్టమవుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన రంగస్థల పౌరాణిక నాటక రంగంపై క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గతంలో ఊరూరా నాటక ప్రదర్శనలతో సందడి నెలకొనేది. అనేక ఉత్సవాల్లో రంగస్థల వేదికలపై పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలతో కళావైభవం కనువిందు చేసేది. ప్రస్తుతం ఇది కొన్ని ఉత్సవ పందిర్లకే పరిమితమైంది. పెద్ద నాటకాల్లో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తోంది. చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఉపాధి దూరమైంది. ప్రస్తుతం వారి పరిస్థితి రంగులు వెలిసిన జీవితంగా మారింది.

దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు చెందిన రంగస్థల నటుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారెందరో ఉన్నారు. లవకుశ సినిమా రాక ముందే చింతా సుబ్బారావు నేతృత్వంలో లవకుశ డ్రామా ట్రూపు ఉండేదట. అప్పట్లో ఆ నాటకం ప్రేక్షకాదరణ పొందిందని చెబుతూంటారు. తరువాత రాజానగరం మండలం సంపత్‌ నగరం గ్రామానికి చెందిన పేపకాయల లక్ష్మణరావు (సంపత్‌ నగరం లక్ష్మణరావు) ఆంజనేయుని పాత్ర పోషించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి అభినవ ఆంజనేయునిగా పేరొందారు. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. కొత్తపేటకు చెందిన జగత పెద్దకాపు 1960–75 మధ్య కాలంలో దుర్యోధనుడు, విశ్వామిత్రుడు తదితర పాత్రలకు జీవం పోశారు. కోరుకొండకు చెందిన ఎన్‌వీఎల్‌ ఆచారి దుర్యోధనుడిగా రాణించారు. కృష్ణుడిగా సత్యంశెట్టి (ద్వారపూడి) సూర్యారావు, ఆయన తనయుడు శేషగిరిరావు, యెరుబండి మందేశ్వరరావు, కోట నాగేశ్వరరావు, సుబ్బిశెట్టిగా పడాల సుందరం (జూనియర్‌ రేలంగి), మాయల ఫకీర్‌గా బెజవాడ రామారావు, బత్తిన నాగేశ్వరరావు, ధర్మరాజుగా నరేంద్రపురపు గంగరాజు, కొమ్మిశెట్టి పెద వీర్రాజు, అర్జునుడిగా తంబాబత్తుల నాగేశ్వరరావు తదితర నటులు రంగస్థలంపై తమ నటనా కౌశలాన్ని చాటారు. అలాగే ప్రస్తుతం శ్రీరాముడిగా సంపత్‌ నగరం లక్ష్మణరావు కుమారుడు పి.రామాంజనేయులు, ఆయన తనయుడు జూనియర్‌ లక్ష్మణరావు ఆంజనేయుడిగా, చింతామణిలో శ్రీహరిగా పుణ్యక్షేత్రం సత్యప్రసాద్‌ తదితరులు రాణిస్తున్నారు.

ఎందరున్నా కొందరికే..

ప్రస్తుత తరం నటీనటుల్లో కేవలం కొందరికే నాటక అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, అమలాపురం, కొత్తపేట, కడియం, వాడపాలెం, వానపల్లి, అవిడి, రామచంద్రపురం, తుని, ద్రాక్షారామ, తుని, జగ్గంపేట, కాకినాడ, యానాం, తాళ్లరేవు, చల్లపల్లి, సీతానగరం, అనపర్తి, రాజోలు, రాజానగరం, బిక్కవోలు, పెద్దాపురం, సామర్లకోట, మండపేట, ముమ్మిడివరం తదితర అనేక ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులతో పాటు శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలను పురస్కరించుకుని వరుసగా 9, 10 రోజులు నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. దానితో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన పెద్ద కళాకారులకే కాక చిన్న కళాకారులకు కూడా అవకాశాలు లభించేవి. కాలక్రమేణా పందిర్ల లైటింగ్‌, తదితర ఏర్పాట్లు, ఉత్సవాల ఖర్చు పెరగడంతో పాటు ఆర్టిస్టుల పారితోషికం అధికమవడంతో అనేక పందిర్లలో నాటక ప్రదర్శనలకు స్వస్తి చెప్పారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌, చాగల్లు, అమలాపురం, కడియం వంటి పలు పందిర్లలో ఐదారు నాటకాలు ప్రదర్శిస్తూండగా, మరో ఐదారు పందిర్లలో కళా ప్రోత్సాహకుల ఆర్థిక సహకారంతో కేవలం ఒకటి, రెండు ప్రోగ్రామ్స్‌ పెడుతున్నారు. అవీ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నటులను తీసుకువచ్చి నాటకాలు వేయిస్తున్నారు. ఆ నాటకాల్లో ఒక్కో నటుడు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. అలా ఒక్కో నాటకానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అవుతుంది.

హార్మోనిస్టుల పాత్ర కీలకం

రంగస్థల నాటకానికి హార్మోనియం ప్రధానం. నాటక కళాకారుడు ఎంత బాగా పాడినా, పద్య రాగాలాపన చేసినా దానికి హార్మోనియం, డోలక్‌, క్లారినెట్‌ సహకారం అవసరం. వేదికపై నటుడి కృషి ఎంతో ఉంటుందో, స్టేజీ ముందు హార్మోనియం, డోలక్‌, క్లారినెట్‌ కళాకారుల కృషి కూడా అంతే ఉంటుంది. ఇటువంటి కళాకారులు జిల్లాలో ఎంతో మంది ప్రతిభ చూపి తెరమరుగయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి చెందిన కలిగట్ల వెంకటరమణ, సత్తిబాబు, సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మైలవరపు శ్రీనివాస్‌ నాయుడు, కోరుకొండకు చెందిన సుబ్రహ్మణ్యం, నరేంద్రపురానికి చెందిన టేకి వీరబాబు తదితరులు హార్మోనిస్టులుగా రాణిస్తున్నారు.

మనుగడ లేని డ్రెస్‌ కంపెనీలు

ఒకప్పుడు డ్రామా డ్రెస్‌ కంపెనీలు ఎక్కువగా ఉండేవి. నటులకు వివిధ నాటకాల్లో ధరించే పాత్రలకు సంబంధించిన డ్రెస్‌లు, విగ్గులు, కిరీటాలు, గద, విల్లంబులు, కత్తులు వంటి ఆయుధాల నమూనాలు వంటి సామగ్రి అద్దెకు ఇచ్చేవారు. ప్రదర్శన పూర్తయిన తరువాత ఆ సామగ్రిలో నలిగిన వాటిని బాగు చేసి మరో ప్రదర్శనకు సిద్ధం చేసేవారు. ఇలాంటి డ్రామా డ్రెస్‌ కంపెనీలు పట్టణాల్లో ఉండేవి. ఒక్క రాజమహేంద్రవరంలోనే 10 వరకూ నిర్వహించేవారు. ప్రస్తుతం నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో డ్రామా డ్రెస్‌ కంపెనీలు కనుమరుగయ్యాయి.

అవకాశాలు లేకుంటే పస్తులే

30 ఏళ్ల నుంచి రంగస్థల నాటక రంగంలో నటులకు అలంకరణ, డ్రెస్‌లు, సామగ్రి సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వేషాల సామగ్రి స్థానికంగా తయారు చేయడంతో పాటు చైన్నె వంటి నగరాల నుంచి కొన్ని తీసుకు వస్తాం. నాతో పాటు మరో ఐదుగురు పని చేస్తారు. గతంలో మాదిరిగా ఇప్పుడు అవకాశాలు లేవు. వేరే వృత్తిలోకి వెళ్లలేక అవకాశాలు ఉన్నప్పుడు తింటున్నాం. లేకుంటే పస్తులుంటున్నాం.

– తూము రమేష్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌,

డ్రామా డ్రెస్‌ కంపెనీ, రాజమహేంద్రవరం

ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే మనుగడ

నేను కురుక్షేత్రం నాటకంలో పలు పాత్రలు పోషిస్తాను. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఉత్సవ కమిటీలతో పాటు ప్రభుత్వం పౌరాణిక రంగస్థల నాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తేనే మాలాంటి చిన్న నటులు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అక్కడ ఏటా వివిధ ఉత్సవాల్లో నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– అన్నందేవుల నారాయణరావు,

రంగస్థల కళాకారుడు, కేశవరం, మండపేట మండలం

కళాపోషణ లేక..1
1/4

కళాపోషణ లేక..

కళాపోషణ లేక..2
2/4

కళాపోషణ లేక..

కళాపోషణ లేక..3
3/4

కళాపోషణ లేక..

కళాపోషణ లేక..4
4/4

కళాపోషణ లేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement