
గురుదేవా.. అందుకో పురస్కారం
రాయవరం: బోధకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, డైట్, సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. సెల్ఫ్ నామినేషన్, రికమండెడ్ బై 5 ఫెలో టీచర్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అవార్డ్ త్రూ లీప్ యాప్ ఇలా మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేయనున్నారు. వ్యక్తిగతంగా నామినేషన్ చేసుకునే వారితో పాటు, కొందరు ఉపాధ్యాయులు తమ పని తాము చేసుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ఐదుగురు ఉపాధ్యాయులు కలసి ఒకరిని ఎంపిక చేస్తారు. లీప్ యాప్ ద్వారా ఎంపిక చేసే ఉపాధ్యాయుల జాబితా రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకుంటుంది. జిల్లా నుంచి 16 మందిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల పనితీరును జిల్లా కమిటీ పరిశీలించి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సిఫార్సు చేయనుంది. జిల్లా స్థాయి అవార్డుల ఎంపికను డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు చేయనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ కేటగిరీ పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, క్రాఫ్ట్/మ్యూజిక్/డ్రాయింగ్ టీచర్లు, డైట్లో పనిచేసే సీనియర్ లెక్చరర్స్, తెలుగు/హిందీ/సంస్కృత పండిట్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు కనీసం పదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. అలాగే ఏ విధమైన క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ కేసులు లేనివారు మాత్రమే అర్హులు.
వివిధ స్థాయిల్లో కమిటీలు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు మండల స్థాయిలో ఎంఈఓ చైర్మన్గా, సభ్యులుగా స్థానిక హెచ్ఎం, డైట్ లెక్చరర్/మండలానికి చెందని మరో హెచ్ఎం సభ్యులుగా ఉంటారు. మండలంలోని ఎంఈఓ పరిధిలోని ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఒకరిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు వారు పనితీరు ఆధారంగా మార్కులను కేటాయిస్తారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాను ఎంఈఓలు జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తారు. అలాగే డివిజనల్ స్థాయిలో డీవైఈఓ చైర్మన్గా, మరో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా, డైట్ ప్రిన్సిపాల్, ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్, జిల్లా కలెక్టర్చే ఎంపిక కాబడిన మరో జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు కూడా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.
ఉత్తమ ఉపాధ్యాయ
పురస్కారాలకు ఆహ్వానం
ఈ నెల 8 వరకూ అవకాశం
మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ
పారదర్శకంగా ఎంపిక
జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించాం. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేస్తాం. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుదారుల్లో అన్ని విభాగాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తిస్తాం. దీనికి గాను అన్ని చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 8వ తేదీ వరకు డివిజనల్ స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
11న వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేస్తారు. 12న డివిజనల్ స్థాయిలో స్క్రూట్నీ చేసిన జాబితాను డీఈఓ కార్యాలయంలో అందజేస్తారు.
14న డివిజనల్ స్థాయి నుంచి వచ్చిన అన్ని కేటగిరీల దరఖాస్తులను స్క్రూట్నీ చేసి 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
16న తుది జాబితాను జిల్లా విద్యాశాఖ నుంచి పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు.
21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికై న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
25న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న వారి తుది జాబితాను రూపొందిస్తారు.
సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేస్తారు. లీప్ యాప్ ఆధారంగా ఇచ్చే ఈ అవార్డులకు గాను ఈ నెల 4న జిల్లాల వారీగా జాబితాను ఎంపిక చేస్తారు. 8న జిల్లా స్థాయి కమిటీ ఎంపికై న వారి పనితీరును పరిశీలిస్తుంది. 14న జిల్లా స్థాయి కమిటీ పరిశీలన అనంతరం 1:1 నిష్పత్తిలో జాబితాను ఎంపిక చేసి, 16న రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. వీరికి కూడా ఈ నెల 21 నుంచి 23 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

గురుదేవా.. అందుకో పురస్కారం