
హోరాహోరీగా జాతీయ స్థాయి హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జాతీయ స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. తొలుత ఈ మ్యాచ్లను ముఖ్య అతిథులు డైరెక్టర్ ఆఫ్ మినిస్టరీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ జి.సతీష్ బాబు, విశాఖ పోర్టు ఫైనాన్స్ హెడ్ డి.రమణమూర్తి ప్రారంభించారు. మూడో రోజు మొదటి మ్యాచ్లో ఉత్తరాఖండ్, అసోం జట్లు పోటీ పడగా 2–2తో మ్యాచ్ డ్రా అయ్యింది. రెండో మ్యాచ్లో బీహార్, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా నిర్వాహకులు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్లను టోర్నీ కోఆర్డినేటర్ వి.రవిరాజు పర్యవేక్షించారు.
షటిల్ బ్యాడ్మింటన్
పోటీలకు ఎంపిక
తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంకకు చెందిన సుంకర సాకేత్ అండర్– 14 షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ కోచ్ నాగులుకొండ వీరభద్రరావు తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్లో ఐసీఎస్సీ స్కూల్ గేమ్స్ అండర్– 14లో సాకేత్ ఆంధ్ర, తెలంగాణ రీజనల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో స్థానంలో నిలిచారన్నారు. సెస్టెంబర్ 24, 25 తేదీల్లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వీరభద్రం తెలిపారు. సాకేత్ను, అతని తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ సుంకర గంగరాజును పలువురు అభినందించారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కపిలేశ్వరపురం (మండపేట): కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం గుడ్డిగూడేనికి చెందిన గుత్తుల బాలకృష్ణ (26) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ద్వారపూడి రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ద్వారపూడి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వై.నాగేశ్వరరావు తెలిపారు. అవివాహితుడైన బాలకృష్ణ మండపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు హెచ్సీ నాగేశ్వరరావు తెలిపారు.
వ్యక్తి దుర్మరణం
కాజులూరు: తణుకువాడకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న కళా సత్యనారాయణ (63) వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు నాలుగు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం గొల్లపాలెంలో బంధువులను కలుసుకునేందుకు వెళ్తుండగా సుబ్రహ్మణేశ్వస్వామి గుడి వద్ద కాకినాడ, కోటిపల్లి రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వెళ్తూ వేగంగా ఢీకొని వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై మోహన్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు.
పోలవరం కాలువలో పడి మహిళ ఆత్మహత్య
జగ్గంపేట: మండలంలో రామవరం వద్ద పురుషోత్తపట్నం ఫేజ్– 2 పోలవరం కాలువలో పడి ఓ మహిళ మృతి చెందినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దాపురం గ్రామానికి చెందిన వివాహిత జి.వరలక్ష్మి (48) కుటుంబ సభ్యులతో సమస్యల కారణంగా క్షణికావేశంలో పోలవరం కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరలక్ష్మి శనివారం ఉదయం పోలవరం కాలువలో దూకి ఉండవచ్చని, ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం అందించారని ఎస్సై చెప్పారు. మృతురాలి భర్త సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శతాధిక వృద్ధురాలి మృతి
నల్లజర్ల: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు కండెపు సోమమ్మ (100) ఆదివారం మృతి చెందింది. ముందురోజు వరకూ ఆమె పనులు ఆమే చేసుకునేదని సోమమ్మ కుమారుడు వెంకటరత్నం చెప్పారు. పలువురు ఆమె పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

హోరాహోరీగా జాతీయ స్థాయి హాకీ పోటీలు

హోరాహోరీగా జాతీయ స్థాయి హాకీ పోటీలు

హోరాహోరీగా జాతీయ స్థాయి హాకీ పోటీలు