
లిక్కర్ వ్యాపారం చేయడం లేదని ప్రమాణం చేస్తావా బాబూ!
ఫ పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరిత చర్యలు
ఫ దావోస్, సింగపూర్కు వెళ్లి
బాబు ఏం తెచ్చారు?
ఫ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ కేసులు
ఫ విలేకర్ల సమావేశంలో
వైఎస్సార్ సీపీ నేతలు
ఫ ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ తోట, వైఎస్సార్ సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటుపరం చేశారు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలే లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. అలా చేయడం లేదని తిరుపతి కొండపై ప్రమాణం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా?’ అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డితో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాల్సిన కూటమి సర్కారు వారిని హింసిస్తోందన్నారు. ఎవరిని జైల్లో పెడదామా అని మంత్రి లోకేష్ ఆలోచిస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. మద్యం అక్రమ కేసులో ప్రమేయం లేని మిథున్రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ‘ఈ కేసులో తొలుత రూ.3,600 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడేమో రూ.11 కోట్లు దొరికాయంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ప్రజలను హింసించే కార్యక్రమాలు చేస్తున్నా.. పవన్ ప్రశ్నించడం లేదు’ అని కారుమూరి అన్నారు. ఈవీఎంల ద్వారానో.. ఎలాగోలా గెలిచిన మీరు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు.
ప్రతిపక్షాల గొంతునొక్కుతూ..
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందన్నారు. ఎప్పుడూ ఇదే విధానం ఉండదని, ప్రభుత్వాలు మారతాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. మిథున్రెడ్డికి ఏం సంబంధం ఉందని మద్యం అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెస్తే.. చంద్రబాబు తిరిగి మద్యం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. డోర్ డెలివరీ చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండానే ఏడాదిలో ప్రభుత్వం చేసిన రూ.1.70 లక్షల కోట్ల అప్పు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. న్యాయస్థానాలు చెప్పినా మిథున్రెడ్డికి జైలు అధికారులు వసతులు కల్పించడం లేదన్నారు.
జగన్ను చూసి బాబుకు నిద్రపట్టడం లేదు
వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షపూరిత చర్యల్లో భాగంగానే మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. దావోస్, సింగపూర్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చారని, పోలవరంలో 10 శాతం కమీషన్ దండుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తూంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. అక్కసుతో రోడ్లు తవ్వేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి అరాచకాలను పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మద్యం వ్యాపారంలో బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు ఇంత వరకూ ఎందుకు బెల్ట్ తీయడం లేదని ప్రశ్నించారు. బెల్ట్ కావాలంటే వైఎస్సార్ సీపీ కొనిస్తుందని చమత్కరించారు. సమావేశంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మిథున్రెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.