
ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీ హోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. చండీహోమంలో 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.
వాడపల్లి వెంకన్న అన్నదాన
భవనానికి విరాళాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వకుళమాత అన్నప్రసాద భవనం నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా అమలాపురానికి చెందిన వరదా శశికుమార్, సూర్య నాగ వెంకట అమృత దంపతులు రూ.1,01,116, విజయవాడకు చెందిన పచ్చిపులుసు రామకృష్ణ, లీలా శ్రీనిర్మలాకుమారి దంపతులు రూ.51,116, కాకినాడ రూరల్ కరప గ్రామానికి చెందిన గొర్రెల సాయి వెంకట వంశీ, వారి కుటుంబ సభ్యులు రూ 50,116 చొప్పున విరాళాలుగా సమర్పించారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది అందజేశారు.