
యోగాకు 7.66 లక్షల మంది నమోదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా 4,889 ప్రాంతాల్లో యోగా సాధనకు 7.66 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా శనివారం యోగా ట్రయల్ రన్ నిర్వహించారు. నగరంలో 45 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవం ఆర్ట్స్ కళాశాల వద్ద పర్యాటక, సాంస్కృతిక శాఖ, సరస్వతీ ఘాట్ వద్ద ఉద్యానవన శాఖ, పుష్కర ఘాట్ వద్ద మత్స్య శాఖ, సుబ్రహ్మణ్య మైదానంలో పోలీస్, సైనిక్ సంక్షేమ శాఖ, ఏకేసీ కాలేజీ రోడ్డులో వైద్య, ఆరోగ్య శాఖ, లాలాచెరువు బీటీ రోడ్డు సమీపాన సూర్య నమస్కారాల విగ్రహాల వద్ద, క్వారీ మార్కెట్, శివాలయం ఎదురుగా జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన యోగా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా...
ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం
ఫ ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం
కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటేశా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజనం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసిన అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.