
సాంకేతికత సమర్థతే భవిష్యత్ వైద్య రంగం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య విద్యార్థులు నిర్వహిస్తున్న ఎరెవ్నా 4.0 వైద్య విజ్ఞాన సదస్సు గురువారం జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఫార్మకాలజీ లెక్చర్ గ్యాలరీలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.విష్ణువర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ పి.చంద్రశేఖర్ హాజరై, సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ వైద్య రంగం సాంకేతికత, సమర్థతల సమాహారం అని అన్నారు. ఈ రెండూ లేని వారు వైద్యరంగంలో తమ మనుగడను కొనసాగించలేరని తేల్చి చెప్పారు. వైద్య విద్యా అభ్యాస నైపుణ్యాలకు సాంకేతికతను జోడించాలని సూచించారు. లోతైన విశ్లేషణలపై మొగ్గు చూపాలన్నారు. ఓ అనారోగ్యాన్ని సామాన్యుడి దృక్కోణంలోనే మనమూ చూస్తే అభ్యాసనకు అర్థం లేదన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ను వీసీ అభినందించారు. ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన డీఎంఈ అకడమిక్స్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ, నేర్చుకోవడమే వైద్యుడి తపన కావాలని అన్నారు. అటువంటి వారు వైద్య రంగాన్ని శాసిస్తారని చెప్పారు. ప్రయోగాత్మక విద్యాభ్యాసం విషయ అవగహనకు దోహదపడుతుందని, ఎరెవ్నా సదస్సు ఆ దిశగా తోడ్పాటునిస్తుందని అన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ మాట్లాడుతూ తమ భవిత కోసం విద్యార్థులే నిర్వహిస్తున్న ఓ అరుదైన సదస్సు ఇదని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి మరో విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సీపీఆర్ మేన్ ఆఫ్ ఇండియా, ఐఎస్ఏ రిసక్స్యుయేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎంపీఆర్.విఠల్, డాక్టర్ శ్రీనివాసన్, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశితో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. తొలి రోజు 14 వర్క్ షాప్లు నిర్వహించినట్లు కోర్ కమిటీ పేర్కొంది. సదస్సు అనంతరం వీసీ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రఘునందన్, డాక్టర్ విష్ణువర్దన్ సత్కారాన్ని అందుకున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి
వీసీ డాక్టర్ చంద్రశేఖర్
ఎరెవ్నా వైద్య విజ్ఞాన సదస్సు ప్రారంభం