
జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా ఘనంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి దుర్గామాతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా బుధవారం ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రత్యంగిర హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. 40 మంది భక్తులు రూ.750 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. దీంతో భక్తులకు హోమ మంటపం సరిపోక ఇబ్బంది పడ్డారు.
మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించిన రోజు నుంచే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సన్న బియ్యాన్ని వినియోగిస్తామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని అర్హత కలిగిన పాఠశాలలకు మధ్యాహ్న భోజనం తయారీకి ఫైన్రైస్ను అందించామన్నారు.
నేడు కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం
కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా గురువారం చండీహోమం నిర్వహిస్తారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ హోమాలలో రూ.750 టిక్కెట్తో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులతో పోటెత్తింది. సుమారు 40 వేలమంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపధకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు.
జర్నలిస్ట్లపై అక్రమ కేసులు దారుణం
అమలాపురం టౌన్: రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్లు, వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం దారుణమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ కేసులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కక్ష సాధింపు చర్యల్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు, కేసులు అనే కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పారు. భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజాన్ని నేటి కూటమి ప్రభుత్వం ఖతం చేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. ప్రభుత్వం కూటమి పార్టీల నేతలకే రక్షణగా నిలుస్తోందని విమర్శించారు. తుపాకీ గొట్టంతో రాజ్య హింస ద్వారా నియంత పాలన రుచి చూపిస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఆరోపించారు.

సత్యదేవుని ఆలయం భారీ సంఖ్యలో భక్తులు