
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 169 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక త్యాగరాజ నారాయణ సేవా దాస సమితి హాలులో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నామని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థీ ఈ విజయపరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న తరువాత పుట్టిన ఊరిని, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని, వారి అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓలు ఆర్.కృష్ణానాయక్, ఆర్.సుస్మిత, పాఠశాల విద్య ఆర్జేడీ జి.నాగమణి, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరుకు పోలవరం
ఎడమ కాలువ పనులు
ధవళేశ్వరం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్లో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో వచ్చే వారంలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు
24 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 24 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత సీటు నిరాకరించే
పాఠశాలలపై చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు నిరాకరించే పాఠశాలలపై చర్యలు తప్పవని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు హెచ్చరించారు. ఎంఈఓలతో సోమవారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత అడ్మిషన్ల ప్రక్రియను మంగళవారం సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను గత నెల 29న ప్రకటించినప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ప్రవేశాలు పూర్తి కాలేదన్నారు. అడ్మిషన్లు నిరాకరించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను తగు ధ్రువీకరణతో తమ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు నిరాసక్తత చూపితే వారి నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలని సూచించారు.