
త్యాగానికి ప్రతీక
ఈ నెలలోనే హజ్ యాత్ర
అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలివ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండగ జరుపుకొంటారు. దీనికి ప్రామాణికం ఖురాన్. ఈదుల్ ఫిత్ర్(రంజాన్)లో మాదిరిగా బక్రీదు పండగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా(ధార్మిక ప్రసంగం)తో ప్రారంభమవుతాయి. ఈ నెలలోనే హజ్ యాత్ర చేస్తారు. ఈ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్–అల్–హరామ్లోని కాబా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల మంది ముస్లింలు ఒకేసారి హజ్ ద్వారా ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
– సయ్యద్ నిజాముద్దీన్, ఇమామ్, మదీనా మసీద్, రాజమహేంద్రవరం
● జిల్లాలో ఘనంగా బక్రీద్ ● ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండగ ఈద్ ఉల్ అద్హాను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి, ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలు, మసీదులకు వెళ్లారు. ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ నిర్వహిస్తారు. ఇదే రోజు పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలోని పెద్ద మసీదుల్లో బక్రీద్ నమాజ్తో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. ప్రతి ముస్లిం తన జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటలా నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర. బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం రాయల్ మాస్క్, జామా మసీదు, అబూబకర్ షా మసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదుతో పాటు పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించారు.
దైవం పట్ల విధేయత.. ఖుర్బానీ
తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్కు ఖుర్బానీ ఇవ్వడం.. దైవం పట్ల దాసుడు విధేయత ను చాటుకునే ఒక అత్యున్నత సందర్భం. ధార్మికంగానే కాకుండా ప్రాపంచికంగా కూడా బక్రీద్ పండగ వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
– ఎం.ఆరిఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్

త్యాగానికి ప్రతీక