హామీల అమలు లేకుండా సంబరాలా? | - | Sakshi
Sakshi News home page

హామీల అమలు లేకుండా సంబరాలా?

Jun 13 2025 5:23 AM | Updated on Jun 13 2025 5:23 AM

హామీల అమలు లేకుండా సంబరాలా?

హామీల అమలు లేకుండా సంబరాలా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌,

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?

కలగానే రాష్ట్రంలో ఉద్యోగ,

ఉపాధి అవకాశాలు

వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి నేతలు

సాక్షి, రాజమహేంద్రవరం: ఏడాదయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు విమర్శించారు. తాడితోటలోని సంహిత కన్వెన్షన్‌ హాలులో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ముచ్చకర్ల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి విజయారెడ్డి గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల మంది వలంటీర్లను, బేవరేజెస్‌ ఉద్యోగులను, ఎండీయూ ఆపరేటర్లను తొలగించి, వారి జీవితాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడంతో ఏడాదిలో ఒక్కొక్కరు రూ.36 వేల మేర నష్టపోయారన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ అమలు చేయకపోవడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, పరీక్షలకు హాజరు కాలేని దుస్థితి నెలకొందన్నారు. మెగా డీఎస్సీలో 30 వేల పోస్టులని చెప్పి, 16 వేల పోస్టులకు మెగా డీఎస్సీ అని పేరు పెట్టి మోసం చేయడం దారుణమని మండిపడ్డారు. అందరూ చదువుకుని ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి ఇంటికొక ఇంజినీర్‌ను తయారు చేశారని, ఈ పథకానికి 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని అన్నారు. వైఎస్‌ జగన్‌ 2019లో సీఎం అయ్యాక ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు చదువులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కూటమి నేతల మోసపూరిత హామీలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే, అరెస్టు చేస్తున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ చేకూరి వీఎస్‌ రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది శ్రీను, గోపాలపురం అధ్యక్షుడు నక్కా నాగ సత్యనారాయణ, అనపర్తి అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి, రాజానగరం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రగడ కల్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement