
పోతవరంలో నేడు గంగానమ్మ జాతర
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి జాతర శనివారం నిర్వహిస్తున్నారు. గత నెల 29న ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారం నైవేద్యాలతో ముగుస్తాయి. సుమారు 39 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతరకు గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బంధువులు, ఆడపడుచులతో గ్రామం సందడిగా మారింది. విద్యుద్దీప కాంతులతో గ్రామం కొత్త కాంతులు అద్దుకుంది. గ్రామ ప్రధాన రహదారి, కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించి, గంగానమ్మ తల్లికి మంగళ స్నానం చేయించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి బలిచేట కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి శుక్రవారం మహిళా జైలును సందర్శించారు. ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా, న్యాయవాదులు కావాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏ సహకరిస్తుందని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైన వారు సంస్థ నియమించిన పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు.
యోగాంధ్ర మాక్ డ్రిల్ విజయవంతం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన స్థానిక ఏకేసీ కాలేజీ వద్ద హ్యాపీ స్ట్రీట్లో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జేసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు సుమారు 1,500 మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో మరింత మంది పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
20న హుండీల లెక్కింపు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన హుండీల ఆదాయం లెక్కించనున్నారు. దీనికి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన హుండీలతో పాటు, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీని ఆ రోజు తెరిచి, ఆదాయం లెక్కింపు చేపడతామన్నారు.
22న శాంతి కల్యాణం
జ్యేష్ఠ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వారి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం వెబ్సైట్ ద్వారాను, ఆలయం వద్ద గల కౌంటర్లో ముందస్తుగా కల్యాణం టికెట్లు తీసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.

పోతవరంలో నేడు గంగానమ్మ జాతర

పోతవరంలో నేడు గంగానమ్మ జాతర

పోతవరంలో నేడు గంగానమ్మ జాతర