
నేత్రపర్వం.. నృత్యాభినయం
● 9 గంటల పాటు పోటీ పడిన కళాకారులు
● కొనసాగుతున్న అంతర్జాతీయ సంగీత ఫెస్ట్
● గోదారి తీరాన రికార్డుల జడి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వంద మయూరాలు పురి విప్పి ఒక్కచోట చేరి నర్తించినట్టు.. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సంగీత నృత్యానంద లహరిలో ఓలలాడింది. సప్త స్వరాల సమ్మేళనంతో వీనుల విందైన గళ మాధుర్యం.. అద్భుత ఆహార్యంతో చూపులు తిప్పుకోలేనంత నేత్రపర్వంగా సాగిన కళాకారుల లాస్య విన్యాసం.. ప్రేక్షకులను, కళాభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతర్జాతీయ సంగీత ఫెస్ట్–2025లో భాగంగా శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన రెండో రోజు కళాసమ్మేళన్ వైభవంగా కొనసాగింది. నెమలిక నేర్పిన నడకలివీ అన్నట్టుగా.. నృత్య కళాకారులు.. సుస్వర గాత్రంతో గాయకులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఈ సంగీత, నృత్య సంగ్రామంలో ఇరువురూ సమ ఉజ్జీలుగా నిలిచి ప్రేక్షకుల మనసుల్ని దోచారు.
9 గంటల 9 నిమిషాల 9 సెకన్లు
గురువాష్టకంతో పాటు మీనాక్షీ పంచరత్నంలోని శ్లోకాలకు తొమ్మిది మంది గాత్రదానం చేశారు. వారి స్వరాలాపనకు అనుగుణంగా 125 మంది నృత్యకారిణులు పదజతులు కలిపారు. మొత్తం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకన్ల పాటు నిర్విరామంగా సాగిన ఈ అపూర్వ సంగీత, నృత్య సమ్మేళనం అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. మరికొన్ని రికార్డులు కూడా పరిశీలనలో ఉన్నాయి. రెండో రోజు కళా సమ్మేళన్ను విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉదయం ప్రారంభించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల ఆత్మశాంతికి కళాకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సాయంత్రం రుక్మిణీ కల్యాణం నృత్య రూపకం అనంతరం కేరళ సంప్రదాయ నృత్యం మోహినీ అట్టంను చిన్నారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు గుంటూరు తాళ్లపాలెంలోని శ్రీ శివక్షేత్రం పీఠాధిపతులు శివస్వామీజీ సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వనాథ్, రోషన్ గుప్తా, చందన్ చౌబే, కుషాల్ భట్టాచార్య (కోల్కతా), కృష్ణభగవాన్, పోతిన శ్రీనివాస్ తదితరులను సత్కరించారు.