
కోనసీమలో పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ నెలకొల్పాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్
అమలాపురం టౌన్: చమురు, సహజ వాయు వనరులు అధికంగా ఉన్న కోనసీమలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ కోసం అనకాపల్లి జిల్లాలో 200 ఎకరాల స్థల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ.వెయ్యి కోట్లతో నెలకొల్పనున్న ఈ యూనివర్సిటీని రాష్ట్రంలో స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతుండగా అది ఉత్తరప్రదేశ్కు తరలిపోయిందని తెలిపారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ యూనివర్సిటీ రాష్ట్రానికి రాకుండా పోయిందని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కోనసీమలో స్థాపించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ పరిధిలో పలు చమురు సంస్థలు 49 ఏళ్లుగా రూ.వేల కోట్ల విలువైన సంపదను, ఆదాయాన్ని దోచుకుపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రజలకు న్యాయబద్ధమైన రాయల్టీ ఇవ్వకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో అరకొర నిధులు ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల కాలంలో గౌరవ ఉన్నత న్యాయస్థానాలు కూడా కేజీ బేసిన్కు తగిన రాయల్టీ ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. చైన్నెలో ఉన్న చమురు, సహజ వాయువుల రీజినల్ ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని కోనసీమ జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని స్థాపించాలని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ పాల్గొన్నారు.