
ఏదీ.. అనుగృహం!
● కూటమి ఏడాది పాలనలో ముందుకు
కదలని గృహ నిర్మాణం
● పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికల్లో హామీలు
● ఏడాదైనా నెరవేరని వాగ్దానం
● జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం
నిడదవోలు
మండలం
సమిశ్రగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు (ఫైల్)
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. గృహ నిర్మాణానికి లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం.. వాటి సాధన దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ‘మన ఇల్లు.. మన గౌరవం’ పేరుతో అవగాహన సదస్సులు పెడుతూ కొద్ది రోజులు హంగామా చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ నిర్మాణాలపై అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. 6,087 ఇళ్లు మాత్రమే నిర్మించారు. అది కూడా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవే ఎక్కువ శాతం కావడం గమనార్హం. రాజానగరంలో 183, రాజమహేంద్రవరం అర్బన్లో 2,382, కొవ్వూరు అర్బన్లో 214 ఇళ్లు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన మండలాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది.
ఏడాది 10,749 గృహాలు లక్ష్యం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇళ్ల నిర్మాణాలపై గతంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించింది. ఈ మేరకు హౌసింగ్, ప్రత్యేక అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గత ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 4,875 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా 331 మాత్రమే పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 10,749 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 6,087 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అడ్రస్ లేని 2.0
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.0 అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాటి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణానికి నిధులు సైతం పెంచుతామన్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. దీనిపై కూటమి నేతలు నోరు మెదపడం లేదు.
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలంటే ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యం కల్పించింది. లే అవుట్లలో పర్యటించడం, లబ్ధిదారులతో పనుల పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపునకు వెబ్సైట్లో గృహాల పురోగతి నమోదు చేయడం వంటి పనులు వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే కానీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాకారం కావు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం మొక్కుబడి సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తూండటంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పీఎంఏవైపై గందరగోళం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద పేదలు నిర్మించుకుంటున్న ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వచ్చే ఏడాది మార్చి తర్వాత కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు. జిల్లా అధికార యంత్రాంగానికి పంపిన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకునేలా హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
మండలాల వారీగా గృహ నిర్మాణాల లక్ష్యం, సాధించిన వివరాలు
మండలం గృహ సాధించింది
నిర్మాణ లక్ష్యం
అనపర్తి 1,210 161
బిక్కవోలు 999 202
గోకవరం 178 133
కడియం 262 109
కోరుకొండ 239 168
రాజమహేంద్రవరం రూరల్ 251 108
రాజానగరం 214 183
రంగంపేట 158 128
సీతానగరం 145 89
చాగల్లు 203 135
దేవరపల్లి 742 483
గోపాలపురం 587 347
నల్లజర్ల 511 407
నిడదవోలు 305 218
తాళ్లపూడి 343 151
ఉండ్రాజవరం 187 125
నిడదవోలు అర్బన్ 285 214
వైఎస్సార్ సీపీ పాలనలో...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 431 లే అవుట్లలో 65,075 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు. ఇళ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. నిరంతరాయంగా సాగింది. సకాలంలో బిల్లులు రావడంతో లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టారు. ఇప్పటి వరకూ 25,316 ఇళ్లు అన్ని హంగులతో పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు సైతం జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.