
ప్రకృతికి ప్రణామం
● సేంద్రియ సాగుపై రైతు మొగ్గు
● జిల్లాలో లక్ష్యం 47 వేల ఎకరాలు
● 35 వేల ఎకరాల్లో వరి
● 12 వేల ఎకరాల్లో ఇతర పంటలు
● 43 వేల మంది రైతుల ఎంపిక
దేవరపల్లి: జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన పంట దిగుబడులు అందిస్తున్నారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా వస్తూండటంతో సేంద్రియ వ్యవసాయం గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తూండటంతో జిల్లాలో ప్రకృతి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే సాగు చేస్తున్న వారితో పాటు ఏటా కొత్త రైతులను ప్రకృతి సాగు వైపు అధికారులు, సిబ్బంది మళ్లిస్తున్నారు.
ఇదీ ప్రకృతి సాగు లక్ష్యం
ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. దీని కోసం 43 వేల మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో రైతు అరెకరం నుంచి ఎకరం వరకూ ప్రకృతి సాగు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ మధ్య ప్రకృతి సాగు ప్రణాళికకు తుది రూపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 2022–23 ఖరీఫ్లో 19,500 మంది రైతులు 17 వేల ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశారు. 2023–24 ఖరీఫ్లో 32 వేల మంది 28 వేల ఎకరాల్లోను, గత ఏడాది ఖరీఫ్లో 36 వేల మంది 40 వేల ఎకరాల్లోను ప్రకృతి సాగు చేపట్టారు.
నవధాన్యాల విత్తనాలు సరఫరా
ప్రకృతి సాగు విధానంలో ఖరీఫ్ ప్రారంభానికి రెండు నెలల ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుంటే భూసారం పెరిగి ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుతుంది. దీనికి అవసరమైన నవధాన్యాల విత్తనాలను రైతులకు అధికారులు సరఫరా చేస్తున్నారు. ఐదు జాతుల పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, సుగంధద్రవ్యాలు, 15 నుంచి 20 రకాల నూనె జాతులను అందిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసిన రెండు నెలల్లో వచ్చిన పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని పంటలు వేసుకోవాలి. దీనివలన ఎకరాకు 10 నుంచి 12 టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం 40 నుంచి 50 శాతం తగ్గుతుంది. ప్రస్తుత ఖరీఫ్లో పచ్చిరొట్ట పంటల సాగుకు ఎకరాకు 12 కిలోల చొప్పున సుమారు 564 క్వింటాళ్ల నవధాన్యాల విత్తనాలను రైతులకు సరఫరా చేశారు.
సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ
సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏటా కొత్త రైతులను ఎంపిక చేసి, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచుతున్నాం.
– బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్,
ప్రకృతి వ్యవసాయ విభాగం, రాజమహేంద్రవరం

ప్రకృతికి ప్రణామం

ప్రకృతికి ప్రణామం