
భక్తుల అసంతృప్తికి బాధ్యులెవరు?
గత ప్రభుత్వంలో ఇలా..
గతం లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవస్థానంలో సుమారు రూ.30 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. 50 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వారికి 30 నుంచి 40 శాతం పారితోషికం పెంచారు. భక్తుల సదుపాయాలకు పెద్ద పీట వేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించి భక్తుల అసంతృప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులను అన్ని విభాగాల్లోనూ అసంతృప్తి వెంటాడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చేసిన సర్వేలలో వెల్లడవుతున్న నిజం. రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తుల అభిప్రాయాలను సేకరిస్తుండగా ఏ నెలలో కూడా అన్నవరం దేవస్థానం టాప్ వన్ స్థానంలో లేకపోవడం విశేషం. తాజాగా ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన భక్తుల్లో 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది.
ఒకప్పుడు ఎంతో గొప్ప
అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయమంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఉత్తరాన పంపా నది, పచ్చని రత్నగిరి, సత్యగిరి కొండలపై వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత సత్యదేవుడు, నిత్యకల్యాణం పచ్చతోరణంలా విలసిల్లే ఆలయం, కమ్మని సత్యదేవుని ప్రసాదం, ఎక్కడ చూసినా అద్దంలా దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణం, భక్తులకు గౌరవ మర్యాదలతో సిబ్బంది సేవలు ఇలా ఉండేది. నేడు సిబ్బందికి, ఈఓకు మధ్య కుదరని సమన్వయం, క్షేత్రస్థాయిలో పర్యటించని ఈఓ, ఆయన వ్యవహారశైలిపై అధికారుల అసంతృప్తి, వీటిపై మీడియాలో వచ్చిన కథనాలపై అడిషనల్ కమిషనర్ నివేదిక సమర్పించినా దానిపై ఏ విధమైన స్పందన లేని వైనం ఇలా అంతా అందరిదీ తలో దారి అన్నట్టు తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మే లో పెరిగిన భక్తుల అసంతృప్తి
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జనవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం ఏడో ర్యాంకులో నిలిచింది. ఫిబ్రవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో ర్యాంకు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో సర్వేలలో భక్తుల అసంతృప్తి 30, 31శాతంగా నమోదైంది. మే నెలలో ఇది 35 శాతానికి చేరింది.
ఏప్రిల్ 30– మే 25 మధ్య అభిప్రాయాల సేకరణ
దేవస్థానాలు భక్తులకు అందిస్తున్న సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం , తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ నృశింహస్వామి దేవస్థానం, నంద్యాలలోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం, అన్నవరంలోని సత్యనారాయణ స్వామివారి దేవస్థానాల్లో భక్తుల అభిప్రాయాలు సేకరించింది.
దర్శనంపై 32 శాతం అసంతృప్తి
సత్యదేవుని దర్శనం సకాలంలో జరిగిందా అనే దానికి 68 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా 32 శాతం మంది కాలేదని చెప్పారు. దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 61 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై 64 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
బాధ్యత ప్రభుత్వానిదా.. అధికారులదా?
అన్నవరంలో పరిస్థితి దిగజారడానికి బాధ్యత ఎవరిది అనే చర్చ నడుస్తోంది. ఒక నెలలో అసంతృప్తి ఉంటే తరువాత నెల మార్పు వచ్చేలా చేయాలి. కాని అదే అసంతృప్తి కొనసాగుతుంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అనే అభిప్రాయం వినిపిస్తోంది.
పరిస్థితి చక్కదిద్దాలని
కలెక్టర్ ప్రయత్నించినా....
జనవరిలో ఏడో ర్యాంకు రావడంతో కలెక్టర్ షణ్మోహన్ ఫిబ్రవరిలో దేవస్థానానికి వచ్చి అన్ని విభాగాల పర్యవేక్షించి పలు చర్యలు తీసుకున్నారు. అన్నదానంలో సిట్టింగ్తో బాటు బఫే పద్ధతిలో కూడా భోజనాలు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. సత్రాలలో గదులు భక్తులకు అద్దెకివ్వాలని, బ్లాక్ చేసి దళారీల ద్వారా అమ్ముకోవద్దని హెచ్చరించారు. ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ కోసం వైఫై ఏర్పాటు చేసి దర్శనం, సేవా టిక్కెట్ల కొనుగోలు, సత్రాలలో గదులు అద్దెకిచ్చేలా ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆ నెలకే అదంతా అమలైంది.
భక్తుల అసంతృప్తికి కారణాలివీ...
పనితీరు మార్చుకోని అధికారులా?
విమర్శలొచ్చినా పట్టించుకోని
ప్రభుత్వమా?
మెరుగుపడని అన్నవరం
దేవస్థానంలో పరిస్థితులు
వైఫే పనిచేయక భక్తులు డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రయాస పడాల్సి వస్తోంది.
పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు మళ్లీ చెలరేగి పోతున్నారు. వీరు భక్తులను రూ.వేయి ఇవ్వండి సులభంగా దర్శనం చేయిస్తాం అని చెప్పి దేవస్థానం ఉద్యోగులు, సెక్యూరిటీ వారికి ఆ భక్తులను అప్పగిస్తారు. వారు నేరుగా దేవాలయానికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తారు. గైడ్లు వసూలు చేసిన సొమ్ము సమానంగా పంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేవస్థానం ఈఓ ఎప్పుడూ ఆలయంలో గంట సేపు ఉన్న దాఖలా లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరు నెలలుగా దేవస్థానంలో వివాదాలు లేని నెల లేదంటే ఆశ్చర్యం. ఫిబ్రవరిలో ఉచిత కల్యాణ మండపంలో ఒక సంస్ధ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వివాదంగా మారింది. మార్చి నెలలో దేవస్థానంలో చినబాబు హల్చెల్ చేయడం, అదే నెలలో ఏసీ గదులు అద్దెకివ్వడం లేదని ఈఓ చేసిన ప్రకటన వివాదాస్పదం అవడం, ఈఓపై దిగువ స్థాయి అధికారుల అసంతృప్తి, ఈఓపై వచ్చిన విమర్శలపై ఏడీసీ విచారణ, ఏప్రిల్, మే నెలలో శానిటేషన్ సిబ్బంది జీతాల ఆలస్యం, చెత్త ట్రాక్టర్ టెండర్ వివాదం, మేలో కల్యాణోత్సవాలలో వనదుర్గ అమ్మవారికి హోమాలు నిలిపివేయడం, శ్రీపుష్పయాగం రోజు స్వామి, అమ్మవారి అలంకరణ ఆకట్టుకోకోపోవడం ఇలా ఎన్నో వివాదాలు దేవస్థానం ప్రతిష్ఠను పలుచన చేశాయి.