తల్లికి వంచనే | - | Sakshi
Sakshi News home page

తల్లికి వంచనే

Jun 13 2025 5:23 AM | Updated on Jun 13 2025 5:23 AM

తల్లికి వంచనే

తల్లికి వంచనే

తాళ్లపూడి (కొవ్వూరు): ఎటువంటి నిబంధనలూ లేకుండా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆ మాట తప్పి, తల్లులను మోసం చేశారని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తలారి వెంకట్రావు విమర్శించారు. కొవ్వూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అంటేనే మోసానికి, వెన్నుపోటుకు చిరునామా అని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకానికి ‘300 యూనిట్లకు మించి కరెంటు వాడకం’ నిబంధన లేకుండా చేస్తానని ఎన్నికల్లో పదేపదే మాయ మాటలు చెప్పారని, నేడు అదే నిబంధన పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరి పేరిట కరెంట్‌ మీటర్‌ ఉంటే వేర్వేరుగా లెక్క కట్టాలని, అలా కాకుండా రెండు మీటర్ల నుంచి వాడిన కరెంటు యూనిట్లు లెక్క కడుతున్నారని చెప్పారు. అలాగైతే, ఇళ్లు అద్దెకిచ్చిన వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎటువంటి నిబంధనలూ విధించబోమన్న మాట తప్పి, తల్లికి వందనం పథకానికి అనేక మందిని దూరం చేసి, డబ్బులు మిగుల్చుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘నీకు రూ.15 వేలు, నీకు 15 వేలు’ అని ఎన్నికల్లో చెప్పి.. ఇప్పుడు రూ.13 వేలు వేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. ఒక ఇంట్లో ఉన్న ఆధార్‌ కార్డులన్నింటినీ కలిపి లింక్‌ పెట్టడం సరికాదన్నారు. తల్లి ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా అనర్హులని అంటున్నారని, నిబంధనలు సడలించాలని వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

టెన్త్‌ సప్లిమెంటరీలో

82.99 శాతం ఉత్తీర్ణత

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా 82.99 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 3,057 మంది హాజరు కాగా 2,537 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మార్కుల జాబితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్‌.బీఎస్‌ఈ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫలితాల్లో ఏమైనా అనుమానాలుంటే ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో..

ఓపెన్‌ స్కూలు టెన్త్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఓపెన్‌ స్కూలు ఇంటర్‌ పరీక్షలు 730 మంది రాయగా 371 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో 460 మంది పరీక్షలు రాయగా 246 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్‌ ఫీజు రూ.200, రీ వెరిఫికేషన్‌ ఫీజు రూ.1,000 చొప్పున చెల్లించాలి.

యోగాంధ్రపై పోటీలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌, ఈ కార్యక్రమం జిల్లా నోడల్‌ అధికారి ఎస్‌.చిన్నరాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్‌పై ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాటల విభాగంలో విజేతకు రూ.లక్ష, కవితలు, డాక్యుమెంటేషన్‌ పోటీల విజేతలకు రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేస్తామని వి వరించారు. ఈ పోటీల దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ అవకాశం ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను శనివారం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఎంవీ సుబ్రహ్మణ్యం, హెడ్మాస్టర్‌, ఎస్‌కేవీటీ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం చిరునామాలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

వర్షాల హెచ్చరికలతో

ఈపీడీసీఎల్‌ అప్రమత్తం

విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్‌ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్‌ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్‌ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్‌ రూమ్‌ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో

కంట్రోల్‌ రూము నంబర్లు

రాజమహేంద్రవరం: 73822 99960

కాకినాడ: 94931 78718

కోనసీమ: 94409 04477

కార్పొరేట్‌ ఆఫీస్‌: 1912

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement