విద్యార్థులకు కిట్‌కట | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కిట్‌కట

Jun 13 2025 5:23 AM | Updated on Jun 13 2025 5:23 AM

విద్య

విద్యార్థులకు కిట్‌కట

● ప్రచారార్భాటానబడి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నాయి. పనులు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదు. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా ఇచ్చిన హామీల అమలు మొదలుకుని అన్నింటా పాలనలో తిరోగమనమే కనిపిస్తోంది. చివరకు గత జగన్‌ పాలనలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యపై కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) కిట్లు అందజేసినట్టు విద్యా శాఖా మంత్రి లోకేష్‌ను సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ భజన బృందం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది.

ప్రభుత్వం విఫలం

సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువైన విద్యార్థి మిత్ర కిట్‌లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విద్యార్థిని కదిపినా బూట్లు రాలేదని, బ్యాగ్‌లు, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. పుస్తకాలు మినహా కిట్‌లో మిగిలిన ఏ ఒక్కటీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్‌లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

బాబు పాలనలో ఎప్పుడూ ఇంతే..

చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఇలానే జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బూట్లు, యూనిఫాం అందజేసేందుకు ముందస్తు ప్రణాళిక ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సగం విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ బడులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

● జిల్లాలోని 19 మండలాల్లో అన్ని రకాల పాఠశాలలూ కలిపి 984 ఉన్నాయి. వీటిల్లో 44,771 మంది బాలు రు, 49,583 మంది బాలికలు చదువుతున్నారు.

● జిల్లాకు పాఠ్య పుస్తకాలు 4,14,529, వర్క్‌ బుక్స్‌ 76,662, నోట్‌ బుక్స్‌ 6,62,952, డిక్షనరీలు 14,947, బెల్టులు 61,548 వచ్చాయి.

● మొత్తం విద్యార్థులకు 94,354 బ్యాగ్‌లు రావాల్సి ఉండగా 67,158 మాత్రమే వచ్చాయి.

● 94,548 బూట్లు రావాల్సి ఉండగా 84,726 మాత్రమే వచ్చాయి.

● 94,354 యూనిఫాంలు రావాల్సి ఉండగా 50,549 మాత్రమే వచ్చాయి.

రాజమహేంద్రవరంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు

జగన్‌ హయాంలో..

చంద్రబాబు పాలనకు భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింతగా ప్రోత్సహించేలా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో మాదిరిగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు అదనంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌ బుక్స్‌, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు జత చేసి ఇచ్చారు. పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా అందజేసేవారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలు తెరచిన రోజున విద్యా కానుక అందజేశారు. ఈసారి అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో కిట్‌ల పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వచ్చిన కిట్‌లను కూడా విద్యార్థులకు అందజేయకుండా ఆపేశారు. దీనిపై అడిగితే మెగా పేరెంట్స్‌ మీట్‌లు పెట్టి అందజేస్తామంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీని ప్రచారార్భాటానికి వాడుకోవాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రారంభమైన పాఠశాలలు

పుస్తకాలకే ‘విద్యార్థి మిత్ర’ కిట్‌ పరిమితం

బూట్లు, బ్యాగులు, యూనిఫాం లేవు

ఇతర వస్తువుల ఊసే లేదు

కూటమి సర్కారు వైఫల్యం

విద్యార్థులకు కిట్‌కట1
1/1

విద్యార్థులకు కిట్‌కట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement