
మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
రాజానగరం: మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘించి, వాణిజ్య పరమైన లాభాల కోసం చెరువులను తవ్వి, మట్టి తరలిస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. మండలంలోని తూర్పు గానుగూడెం ఊర చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై శనివారం జిల్లా కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రయోజనార్థం చెరువులో మట్టిని తవ్వాల్సి వస్తే జల వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలన్నారు. కానీ, ఆ విధానం లేకుండా, నిబంధనలు పాటించకుండా అధికార పార్టీ అండదండలతో జలవనరులు, మైనింగ్ శాఖల నిబంధనలను అతిక్రమించి ఈ తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ పెద్దల సహకారంతో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ మాఫియా ఇప్పటికే రెచ్చిపోతోందని, చెరువుల పూడికల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి, మట్టి మాఫియా ఆగడాలకు బ్రేకులు వేయాలని, ఇప్పటి వరకూ అనధికారికంగా జరిగిన తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.
ఇంటర్ సప్లిమెంటరీ
ఫలితాల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లా విద్యార్థులు ఫస్టియర్లో 42 శాతం, సెకండియర్లో 55 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి (ఆర్ఐఓ) ఎన్ఎస్వీఎల్.నరసింహం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 3,891 మందికి గాను 1,636 మంది, ద్వితీయ సంవత్సరం 2,624 మందికి గాను 1,437 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 819 మందికి 394 మంది, సెకండియర్లో 542 మందికి 316 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాలపై అనుమానం ఉంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని నరసింహం సూచించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కడియం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర–2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తదితరులతో కలసి సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పోస్టర్ను ఆవిష్కరించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్త మామిడి మొక్కలను ఆవిష్కరించి, యోగాంధ్ర–11గా ఒక మొక్కకు, పీఎస్ఎన్–5గా మరో మొక్కకు పేరు పెట్టారు. జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేరావు రచించిన వృక్ష విలాపం గేయం ఆకట్టుకుంది. కార్యక్రమంలో యోగాంధ్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నర్సరీ రైతులు పుల్లా పెద సత్యనారాయణ, కుప్పాల దుర్గారావు, మెర్ల కృష్ణ, పుల్లా వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, అధికారులు పాల్గొన్నారు.
10న వర్చువల్గా
ఆర్టీహెచ్ ప్రారంభం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులు కాటమనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్నలు శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె పాల్గొన్నారు. ఆర్టీహెచ్ ఏర్పాటుకు రాజమహేంద్రవరం రూరల్లో భవనం, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి