
ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయండి
వడిశలేరు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
రంగంపేట: వడిశలేరు గ్రామం వద్ద ఐదుగురు బలైన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై క్షేత్ర స్థాయి అధికారులతో చర్చించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సేకరించి, విశ్లేషణ చేయాలని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడటానికి సమన్వయ శాఖల అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్, జిల్లా ఆర్అండ్బీ అధికారి ఎస్బీవీ రెడ్డి, డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, ఆర్డీసీ ఈఈ రవీంద్ర పాల్గొన్నారు.
నిత్యావసర సరకులు అందించిన కలెక్టర్
రాజానగరం: మండలంలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి నెలా 1 నుంచి 5 వరకూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరకులు అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని 871 రేషన్ దుకాణాల పరిధిలో 5,64,994 మంది కార్డుదారులు ఉన్నారని, వీరిలో వృద్ధులు, దివ్యాంగులు 65,863 మంది ఉన్నారని తెలిపారు. వీరికి ఇళ్ల వద్దనే సరకులు అందిస్తామని చెప్పారు. మూడు రోజులుగా జిల్లాలో 17,286 కిలోల బియ్యం, 16,483 కిలోల పంచదార, 1,512 కిలోల కందిపప్పు సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు.
మత్స్యకారులతో
యోగా సాధన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపాన గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై మత్స్యకారులతో మంగళవారం యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యశాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ వివిధ శాఖల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం కొనసాగుతుందని, 21న అన్ని రంగాలనూ కలుపుకొని మెగా యోగా సాధన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగా గురువు కేఎన్వీ శ్రీధర్రెడ్డి నేతృత్వంలో ఎన్.అనంతలక్ష్మి యోగా సాధన చేయించారు. అనంతరం బ్రహ్మకుమారి మౌనిక రాజయోగ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది మత్స్యకారులు, ఆక్వా రైతులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా సూర్య అరవింద్
తుని: తమిళనాడులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీ ఠం ఉత్తరాధికారిగా తునికి చెందిన డాక్టర్ కాదంబరి సూర్య అరవింద్ నియమితులయ్యారు. ఆయన సో దరుడు కాదంబరి రామకృష్ణ ఈ విషయం తెలిపారు. అరవింద్ చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఉండేవాడని, ఎంబీబీఎస్ చదివి, శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో చేరారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో సేవలందించిన అరవింద్కు పీఠాధిపతి, జగద్గురువు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. దత్తేశ్వరానంద భారతి స్వామిగా సన్యాస నామం ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించా రని వివరించారు. ఈ నెల 6న కుర్తాళంలో ఆయన పట్టాభిషేకం జరుగుతుందని తెలిపారు.

ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయండి

ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయండి