దేవరపల్లి: క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్నరెడ్డి సూచించారు. రామన్నపాలెంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో క్రీడా వసతి గృహాలు ఉండేవని, వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గ్రామీణ క్రీడలను గత ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేదని, వాటిని కూడా తీసివేసిందన్నారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడలు కనుమరుగవుతున్నాయని అన్నారు. ఒలింపిక్స్ క్రీడాకారిణి సత్తి గీత తమ సోదరని ఆయన తెలిపారు. తాను రెండు సార్లు అంతర్జాతీయ స్థాయిలో, 10 సార్లు జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్ ఆడి బంగారు పతకాలు సాధించినట్టు చెప్పారు. బాస్కెట్బాల్ క్రీడలో మార్టేరుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మార్టేరులో తాను స్పోర్ట్స్ భవనం ఏర్పాటు చేసి ప్రతి ఏటా 8, 9, 10 తరగతుల పిల్లలకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రామన్నపాలెంలో దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఉద్యోగ విమరణ అనంతరం స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తానన్నారు.


