అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 20,068 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాష్ట్ర స్థాయిలో ఫలితాల పరంగా జిల్లాకు వచ్చిన ర్యాంక్లు నిరాశ పరిచేలా ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గత సంవత్సరం 19వ స్థానం రాగా ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి గతేడాది జిల్లా 15 స్థానంలో నిలువగా ఈ సంవత్సరం 16వ స్థానం సాధించింది. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలు 10,527 మంది రాయగా 7,580 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరానికి 9,541 మంది పరీక్షలు రాయగా 7,258 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 76 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 16వ స్థానాన్ని జిల్లా సాధించింది. రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలు రాసిన 20,068 మంది విద్యార్థుల్లో 14,838 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 5,230 మంది పరీక్ష తప్పారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ జిల్లా కేంద్రం అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సజావుగా జరిగింది. పరీక్షల సమయంలో ఎవరినీ డీబార్ చేయలేదు.
ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదు. జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ కళాశాల, 104 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) కె.చంద్రశేఖర్బాబు పర్యవేక్షణలో జిల్లాలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. జిల్లాలో ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 1,842 మందికి గాను 1,039 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.4 శాతం ఉంది. జిల్లాలో ప్రథమ సంవత్సరం వొకేషనల్ కోర్సుల విద్యార్థులు 2192 మంది పరీక్షలు రాయగా 41 శాతంతో 895 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఫస్ట్ ఇంటర్లో బాలాజీ బెస్ట్
అమలాపురం రూరల్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పరీక్షా ఫలితాలలో అమలాపురం బీవీసీ అక్షర్ జూనియర్ కళాశాల విద్యార్థి మారిశెట్టి సాయి బాలాజీ 470కి 466 మార్కులు సాధించి కోనసీమ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు.
అమలాపురం రూరల్: భారతదేశంలో 17వ జనాభా గణన చారిత్రాత్మక ఘట్టమని, జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని తహసీల్దార్లు ఎంపీడీవోలు, సాంకేతిక సహాయకులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. ఆయన వారితో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనాభా గణన 2027 సన్నద్ధతలో భాగంగా కీలక అంశాలపై అవగాహన కల్పించారు. గురువారం నుంచి ఈ నెల 30 వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా అర్థ గణాంక అధికారి మురళీకృష్ణ తెలిపారు.
వేగంగా అభివృద్ధి పనులు
జిల్లావ్యాప్తంగా వైద్య రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీఎంఎస్ఐడీసీ కార్య నిర్వాహక ఇంజినీరు సీహెచ్ రతన్ రాజు, వైద్య అధికారుల, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి నాబార్డ్ నిధుల పనుల పురోగతిపై సమీక్షించారు.


