అమ్మలగన్నయమ్మ తలుపులమ్మ తల్లి, ఆది దంపతులైన శివపార్వతులు సైకత రూపున దర్శనమిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పులు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు దేవిన సిస్టర్స్, దేవిన శ్రీనివాస్లు తలుపులమ్మ తల్లి, శివపార్వతుల ఆకృతులతో ఈ సైకత (ఇసుక) శిల్పాన్ని రూపొందించారు. తలుపులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా.. అమరావతి మ్యాక్స్ క్వాజీ బ్యాంకు సీఈఓ ఆది స్వరూప్ పట్నాయక్ ఆధ్వర్యాన 6 టన్నుల ఇసుకతో 18 అడుగులు వెడల్పు, 8 అడుగుల ఎత్తున రూపొందించిన ఈ సైకత శిల్పం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిని శుక్రవారం సాయంత్రం వరకూ భక్తులు దర్శించుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మునుపెన్నడూ ఇటువంటి సైకత శిల్పాలు రూపొందించలేదని, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దీనిని వినూత్నంగా తీర్చిదిద్దామని శ్రీనివాస్ చెప్పారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్పర్సన్ రామలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భార్గవ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
– తుని రూరల్


