అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన సీహెచ్ నాగ లక్ష్మిని కేసీఎం అధికారులు క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. టి.గౌతమ్ అనే ఏజెంట్ ద్వారా నాగలక్ష్మి 2026 ఫిబ్రవరిలో ఖతార్ వెళ్లారు. మారే కీర్తి అనే ఆమె ద్వారా ఒక ఇంట్లో పనికి కుదిరారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న శ్రీలంకకు చెందిన మహిళ నాగలక్ష్మిని తీవ్రంగా హింసించడంతో తన భర్త దుర్గారావుకు విషయం చెప్పారు. ఏజెంట్తో మాట్లాడగా రూ.2లక్షలు కడితే గాని పంపడం కుదరదని చెప్పారు. దీంతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. కేసీఎం బృందం స్పందించి ఏజెంట్తో మాట్లాడి నాగలక్ష్మిని సురక్షితంగా తీసుకువచ్చామని కేంద్ర సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు.


