అమలాపురం టౌన్: అమలాపురం కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ మెమోరియల్ బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలల క్రీడా స్థలంలో మే 1 నుంచి జూన్ 15 వరకూ ఉచిత వేసవి బాస్కెట్, ఫుట్ బాల్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ, బాస్కెట్ బాల్ మాజీ జాతీయ క్రీడాకారుడు కుడుపూడి సూర్యనారాయణరావు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. 45 రోజుల పాటు ఉదయం, సాయంత్రం జరిగే ఈ శిక్షణకు పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయసున్న బాల బాలికలు అర్హులన్నారు. ఫిజికల్ డైరెక్టర్ ఆకుల ఉమ, వ్యాయామ ఉపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, వెంకటరావు కోచ్లుగా వ్యవహరిస్తారన్నారు. ఆసక్తి కలవారు తమ పేర్లను 93986 77969 నంబర్కు ఫోన్ చేసి, నమోదు చేయించుకోవాలని సూచించారు.
నేడు, రేపు క్రీడా ఉత్సవాలు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తునట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు అమలాపురంలో శనివారం కోనసీమ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పొనుగుపాటి శ్రీనివాస్తో కలిసి ఆయన పోస్టర్లను విడుదల చేశారు. ఆసక్తి కల క్రీడాకారులు ఆ రోజుల్లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అరిగెల నాని, పట్టణ అధ్యక్షుడు అయ్యల బాష, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గోకరకొండ గంగన్న స్వామి పాల్గొన్నారు.
అప్పనపల్లిలో భక్తుల రద్దీ
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వా మివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. వైనతేయ నదిలో పుణ్య స్నానా లు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ము డుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,69,006 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,812 విరాళంగా అందించారు. స్వామి వారిని 6,400 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు.


