ప్రేమ పెళ్లి: ‘పైసలు ఇవ్వలేక పోతే చావు’ అని మెసేజ్‌లు పెట్టి వేధించడంతో..

Crime News: Young Woman Died Fiance Harassment Before Marriage In Nalgonda - Sakshi

పెళ్లికి ముందు కాబోయే వరుడి వేధింపులు

యువతి ఆత్మహత్య.. నల్లగొండ జిల్లాలో ఘటన 

హాలియా: పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంట గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పంగవానికుంటకు చెందిన మేగావత్‌ వెంకటేశ్వర్లు కుమార్తె నవత (22), త్రిపురారం మండలంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్‌ జగపతిబాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు ఇటీవల నిశ్చితార్థం జరిపించాయి. కట్నం కింద వరుడికి రూ.20 లక్షల విలువైన ప్లాటుతో పాటు రూ.80 వేల నగదు ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. కట్నం కింద తనకు ప్లాటు వద్దని.. దాన్ని అమ్మి డబ్బులివ్వాలని జగపతిబాబు ఆదివారం రాత్రి నవతకు ఫోన్‌ చేసి తిట్టాడు. ‘పైసలు ఇవ్వలేక పోతే చావు’ అని మెసేజ్‌లు పెట్టి వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవత.. సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top