తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,645 మంది స్వామిని దర్శించుకున్నారు. 29,700 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. వారు సోమవారం డీఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకురాలు పెద్దిరెడ్డి కవిత, యూనియన్ జిల్లా కార్యదర్శి కె.రమాదేవి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కార్మికులకు 16 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం, తగినన్ని వంట పాత్రలు సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తల తరహాలోనే మధ్యాహ్న భోజన కార్మికులకు గ్రాట్యూటీ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్యను బట్టి వేతనంతో కూడిన అదనపు వర్కర్లను నియమించాలని కోరారు.


