చిత్తూరు అర్బన్: ‘‘మద్యం మత్తులో స్టీరింగ్ పడితే అది రోడ్డుపై మృత్యుఘంటికలు మోగించడమే. క్షణికానందం కోసం బాటిల్ పట్టి, ఆపై వాహనమెక్కితే కుటుంబాలకు శాశ్వత విషాదమే మిగులుతుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అంటే మీ ప్రాణాలను మాత్రమే కాదు అమాయకుల ప్రాణాలను కూడా బలితీసుకోవడమే’’ అని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి 771 మందికి రూ.77.10 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
771 మందికి ఫైన్ల వాత
రోడ్డు ప్రమాదాల నివారణ, అమాయకుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఈ ఏడు నెలల కాలంలో పోలీసుల తనిఖీల్లో వందలాది మంది తాగుబోతు డ్రైవ ర్లు చిక్కడం గమనార్హం. 771 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. వారికి కోర్టు రూ.77.10 లక్షల జరి మానా విధించింది. ప్రధాన, జాతీయ రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆక్సిడెంట్ జోన్లలో బ్రీత్ అనలైజర్లతో పోలీసులు డేగకన్ను వేశారు. మద్యం తాగి వాహనం తోలుతూ దొరికిపోతే మో టారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుల్లో నిలబెడుతున్నారు. జరిమానాతో వదిలేది లేదని, క్రమంతప్పకుండా దొరికితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. అవసరమైతే జైలు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు.
బాధ్యత మరవరాదు
జిల్లా ప్రజలందరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనా లు నడపకూడదు. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మద్యం మత్తులో నిర్ణయాలు తీసుకునే సామ ర్థ్యం నశిస్తుంది. ప్రమాదాన్ని ముందే గుర్తించే స్పృహ లేకపోవడం వల్లే ఘోర విపత్తులు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్పై ఎలాంటి రాజీ ఉండేది లేదు. ప్రజల భద్రత కోసమే తనిఖీలను మరింత విస్తృతం చేస్తాం.
– తుషార్ డూడి, జిల్లా ఎస్పీ, చిత్తూరు


