చిత్తూరు కలెక్టరేట్ : దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసమే బాధితుల చెంతకే కమిషన్ వచ్చిందని చైర్మన్ కేఎస్.జవహర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు, ఆక్రమణలపైనే అత్యధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. ‘ఆది ఆంధ్ర‘, ‘ఆది ఆంధ్ర క్రిస్టియన్‘ వర్గీకరణల వల్ల ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీతోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, కుల వివక్ష అంశాలపై రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వీటిపై డీఎస్పీ స్థాయి అధికారి సమగ్ర విచారణ చేసి నివేదికలను పంపాలన్నారు. చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చైర్మన్ ప్రకటించారు. జిల్లాను కుల వివక్ష లేని ప్రాంతంగా, ‘అట్రాసిటీ ఫ్రీ జోన్‘గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్పొరేషన్ రుణాలు, ప్రభుత్వ ప్రయోజనాలను కులం పేరుతో అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.


