నలిగిపోతున్న నాలుగో సింహం!
బందోబస్తు., ప్రోటోకాల్స్కు సరితూగని ఖాకీల సంఖ్య జిల్లాలో తగ్గిన పోలీస్ స్టేషన్లు.. తగ్గని పని ఒత్తిడి పోలీసు కార్యాలయంలో అటాచ్మెంట్లపై తీవ్ర అసంతృప్తి క్యాంపు క్లర్క్ స్థానాల్లో పాతుకుపోవడంపైనా పెదవి విరుపు
చిత్తూరు అర్బన్: జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. స్టేషన్ డ్యూటీలు, బందోబస్తులు, ప్రోటో కాల్స్ విధు లు నిర్వర్తించడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పది మంది చేసే పనిని..కేవలం ఐదారుగురికే అప్పజెబుతుండం పట్ల మనోవేదన చెందుతున్నారు. మిగిలినవాళ్లు దర్జాగా అధికా రుల చుట్టూ చేరి భజనలు చేయడం, మరికొందరు డెప్యుటేషన్ల పేరిట తప్పించుకోవడంపై సాదాసీదా కానిస్టేబుళ్లు లోలోపల కుమిలిపోతున్నారు.
స్టేషన్ల కుదింపు భారం
చిత్తూరు పోలీసు యూనిట్లో జిల్లాల పునర్విభజనకు ముందు 35 పోలీస్ స్టేషన్లు ఉండేవి. తాజాగా పుంగనూరులోని నాలుగు స్టేషన్లు అన్నమయ్య జిల్లా పరిధిలోకి వెళ్లడంతో.. వీటి సంఖ్య 31కి చేరింది. కానీ పోలీసులపై భారం తగ్గలేదు. ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనలతో పాటు బందోబస్తు డ్యూటీలు, ఎమ్మెల్యే, ఎంపీ పర్యటనల బందోబస్తు, స్టేషన్ ప్రోటోకాల్ డ్యూటీ లు చేయలేక విసిగిపోతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా నాలుగో సింహంగా చె ప్పుకునే ఖాకీలు కుంగి కుశించి పోతున్నారు.
ప్రక్షాళన అవసరం
చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో)లో కొందరు అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోవడంపై విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా డీపీవోలోని మినిస్టీరియల్ ఉద్యోగులు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో తోకసాయంగా స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులను పిలిపించి విధులు చేయించుకుంటున్నారు. ‘స్టేసషన్లో కానిస్టేబుల్ చేయాల్సిన పనిని.. మినిస్టీరియ ల్ సిబ్బంది వచ్చిచేయడం లేదు కదా..? కానిస్టేబుళ్లు స్టేషన్లలో లేకపోవడంతో ఆ భారం మాపై పడుతోంది..’ అనేది ప్రతి ఒక్కరి ఆవేదన. డీపీవోను ప్రక్షాళన చేయడంతో పాటు ఇక్కడ పనిచేసే కానిస్టేబుళ్లను స్టేషన్లకు పంపాలని, అటాచ్మెంట్లను రద్దు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. దీనిపై యూనియన్ సైతం నోరుమెదపడం లేదు.
‘సీసీ’పై నిరసన గళం
ఎస్పీ సీసీ (క్యాంపు క్లర్క్) అంటే.. ఇక ఎస్పీ తరువాత ఆయనే అనే గౌరవం, భయం పోలీసుశాఖలో కనిపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సీసీ పనితీరు, అక్రమాలను ప్రశ్నిస్తూ పత్రికా కార్యాలయాలకు లేఖలు వచ్చాయి. పదేళ్లుగా ఓ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి ఎస్పీ సీసీగా పాతుకుపోవడం, అర్హత లేకున్నా పోలీసుశాఖ జీపు ఉపయోగించి, భారీగా ఇంధనం ఉపయోగించారని పేర్కొన్నారు. దీనిపై డీజీపీ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేస్తే జీపు సరెండర్ చేశాడని, కానీ ఇపుడు రెండు ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తూ ఇంధనం కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పైగా తన వ్యక్తిగత, ఇంటి పనులకు ఓ కానిస్టేబుల్, మరో హోంగార్డును ఉపయోగించుకుంటున్నాడని, ఇతనిపై ఏదైనా విచారణ వేస్తే.. స్పెషల్ బ్రాంచ్ ద్వారా క్లీన్చిట్కు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఇతడిని బదిలీ చేయాలని పోలీసు కార్యాలయ సిబ్బంది పేరిట పత్రికా కార్యాలయాలతో పాటు డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు లేఖలు అందాయి. దీనిపై ఇప్పటికే ఎస్పీ తుషార్ డూడీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇది ఒక్క ఎస్పీ సీసీకే పరిమితం కాదు. కొందరు డీఎస్పీల వద్ద పనిచేసే సీసీలపై ఇలాంటి ఆరోపణలు లేకపోలేదు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో సీసీలపైనే లేఖలు ఎక్కుపెట్టడం.. విధుల పేరిట జరుగుతున్న వేధింపులకు నిదర్శమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


