
కొనసా..గుతున్న స్వచ్ఛీకరణ!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా స్వచ్ఛీకరణ సా..గుతోంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత కొన్ని నెలలుగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. జిల్లాల పునర్విభజన అనంతరం చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల స్వచ్ఛీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఈ పరిశీలన ప్రక్రియలో పూతలపట్టు నియోజకవర్గం 46 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, చిత్తూరు నియోజకవర్గం 30 శాతంతో ఆఖరి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 40 శాతం ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ పరిశీలన నిర్వహించారు. ఈ ప్రక్రియ నిర్వహణలో కొన్ని నియోజకవర్గాల అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
పెరిగిన ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2002లో 13,25,269 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 15,68,788 మంది ఓటర్లున్నారు. గత 25 సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 2,43,519 మంది ఓటర్లు పెరిగారు. 2029లో నిర్వహించే సాధారణ ఎన్నికల సమయానికి జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బోగస్ ఓట్లకు చెక్ పెట్టేలా..
జిల్లా వ్యాప్తంగా బోగస్ ఓట్లకు చెక్ పెట్టేలా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓటర్ల గుర్తింపునకు పాత, కొత్త జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2002 నుంచి ఇప్పటి వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉన్న వారిని మాత్రమే స్థానికంగా గుర్తిస్తూ..మిగిలిన వారిన వలసలుగా భావించి వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లా ఓటర్ల స్వచ్ఛీకరణ సమాచారం
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు
నియోజకవర్గం ఓటర్ల సంఖ్య
పుంగనూరు 2,39,149
నగరి 2,02,709
జీడీ నెల్లూరు 2,05,623
చిత్తూరు 2,03,570
పూతలపట్టు 2,21,638
పలమనేరు 2,69,065
కుప్పం 2,27,034
మొత్తం 15,68,788
పకడ్బందీగా ప్రక్రియ
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల స్వచ్ఛీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ప్రక్రియను స్వయంగా పరిశీలన చేస్తున్నాం. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ప్రక్రియ నిర్వహణ పై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తున్నాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. – సుమిత్ కుమార్ గాంధీ, కలెక్టర్, చిత్తూరు

కొనసా..గుతున్న స్వచ్ఛీకరణ!

కొనసా..గుతున్న స్వచ్ఛీకరణ!