
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయంలో రద్దీ చోటుచేసుకుంది. క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. రాత్రి వరకు కూడా రద్దీ తగ్గలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ (ఎంటీఎస్, మినిమం టైం స్కేల్) టీచర్లకు ఆదివారం బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల సీనియారిటీ జాబితా సంబంధిత మండలాలకు పంపినట్లు చెప్పారు. ఆ జాబితా ప్రకారం ఆదివారం చిత్తూరులోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 2008 ఎంటీఎస్ టీచర్లకు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
నేడు గురుకులాల్లో
సీట్ల కేటాయింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆదివారం సీట్లు కేటాయించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాలికలకు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సమీపంలోని సంజయ్ గాంధీ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే బాలురకు చిత్తూరులోని వేము ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని పూతలపట్టు బాలుర గురుకుల పాఠశాలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి హాజరు కావాలని ఆమె కోరారు.
గిన్నిస్ రికార్డు కోసం
గిరిజన పిల్లలకు కష్టాలా?
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ రికార్డు, ప్రధాని మోదీ మెప్పు కోసం గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన హాస్టల్స్ నుంచి యోగాంధ్ర కార్యక్రమానికి అర్ధరాత్రి 2 గంటలకు బస్సులో తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులు నిద్రించడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇదే రీతిలో ప్రజాప్రతినిధుల పిల్లలను తరలిస్తారా..? అని ప్రశ్నించారు. వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పౌష్టికహారం పెట్టడానికి, జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించడం చేతకాదని, యోగాంధ్ర కార్యక్రమానికి మాత్రం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.