
పరామర్శిస్తూ..భరోసానిస్తూ..
వెదురుకుప్పం: కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో విషాద ఛాయలు అలముకున్నాయి. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ, గంగాధరనెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామాల్లో బాధిత కుటుబాలు పుట్టెడు దుఃకంలో మునిగిపోయారు. మృతదేహాలు శుక్రవారం ఆయా గ్రామాలకు చేరుకోగా.. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా బాధిత కుటుంబాలను మాజీ డెప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పరామర్శించారు. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన కేశవులురెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే గ్రామంలో జనార్దన్కు గాయాలయ్యాయి. ఆయన కుమారుడు (45 రోజులు) చనిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగలో పర్యటించి తలసీ మృతదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. జీడీ నెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామంలో శారద పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అదేవిదంగా గాయాలైన వారిని కూడా పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి(వెదురుకుప్పం), ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్, మాజీ ఎంపీటీసీలు ధనంజయరెడ్డి, ఎర్రయ్య, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ లోకనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దేవరాజారెడ్డి, హరినాఽథ్ ఉన్నారు.
మాజీ సీఎం దృష్టికి తీసుకెళతా!
బస్సు ప్రమాద ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్సార్సీపీ నాయకులతో మాట్లాడి బాధిత కుటుంబాల పరిస్థితి, ఇతరత్రా విషయాలపై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

పరామర్శిస్తూ..భరోసానిస్తూ..