
భాషా పండితుల బదిలీల్లో చిత్ర విచిత్రాలు
– నేడు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : చాలా సంవత్సరాలుగా డీఈవో పూల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఈ బదిలీల్లో అయినా దరఖాస్తు చేసుకుని అనుకూలమైన ప్రాంతాలకు వెల్దామని ఆశపడ్డారు. విద్యాశాఖ అధికారులు జారీ చేసిన సీనియారిటీ జాబితా ప్రకారం ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న భాషా పండితుల బదిలీల ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం విడుదల చేశారు. ఆ ఉత్తర్వులను చూసిన భాషాపండితులు నివ్వెరపోయారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బదిలీలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని భాషాపండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు.
నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ ఉత్తర్వులు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని డీఈవో పూల్లో ఉన్న తెలుగు 123, హిందీ 30 మంది భాషాపండితుల ఉత్తర్వులు నిబంధనలకు వ్యతిరేకంగా విడుదల చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫైనల్ సీనియారిటీ జాబితాలో సీరియల్ నెంబర్ 15లో ఉన్న వ్యక్తి తన స్పౌజ్ తిరుపతిలో పనిచేస్తున్నారు. ఆన్లైన్ బదిలీల్లో ఆ టీచర్ తిరుపతిని ఆప్షన్గా పెట్టుకున్నారు. అయితే ఆ టీచర్ తన ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 30వ ప్లేస్ పెనుమూరుకు పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా సీరియల్ నెంబర్ 17లో ఉన్న మరో భాషాపండితుని స్పౌజ్ తిరుపతిలో పనిచేస్తుండగా ప్రాధాన్యత క్రమంలో తిరుపతిని రెండవ ప్లేస్లో పెడితే చివరగా పెట్టిన వరదయ్యపాళ్యంకు బదిలీ చేశారు.
దారుణం
తుది సీనియారిటీ జాబితాలో 79వ నెంబర్లో ఉన్నటువంటి భాషాపండితునికి తన ప్రాధాన్యత క్రమం ప్రకారం కాకుండా ఇంటికి దగ్గరలో ఉన్న తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు. ఇదేవిధంగా చాలా మందికి తుది సీనియారిటీ జాబితాల్లో కింద ఉన్న వారికి దగ్గరలో, మొదట్లో ఉన్న వారికి దూరంగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ సమస్యలపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నష్టపోయిన భాషాపండితులు కూటమి టీడీపీ నిలువునా ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణం అంటూ సామాజిక మాధ్యమాల్లో తమ వ్యతిరేకతను వెల్లడిస్తున్నారు. సీనియారిటీ జాబితాల్లో 1, 2 స్థానాల్లో ఉన్న వారికి 30, 40వ ప్లేసుల్లో బదిలీ చేయడం వింతగా ఉందని మండిపడుతున్నారు. న్యాయం కోసం ఆదివారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు భాషా పండితులు సిద్ధపడ్డారు.